విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. క్రీడామైదానం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు, ట్రాఫిక్ డీసీపీ రవి శంకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కృత్తిక శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్, తదితరులు బాధ్యత తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను వైసీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు నగరంలో సైతం ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షించేందుకు భారీ ఎల్ ఈ డి తెరలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఎంజి రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సామర్థ్యం కేవలం 25 వేలు మాత్రమే, కానీ చుట్టూ క్రీడా ప్రాంగణంలోనూ కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 30 వేల మందిని అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. ఏ1, ఏ2, బి2 గ్యాలరీల ద్వారా ప్రముఖులను అనుమతిస్తారు. జి2, సి4 గ్యాలరీల ద్వారా సాధారణ ప్రజలను అనుమతిస్తారు. 30 వేల మందిని అనుమతించిన తరువాత సందర్శకులను నిలుపుదల చేయనున్నారు. క్రీడా ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. భారీ కూలర్లు అమర్చారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భద్రతా పరంగా భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. కార్యక్రమాన్ని వీక్షించే ప్రజలకు మజ్జిగ, లస్సీ, మంచినీరు, తినుబండారాలు (స్నాక్స్) అందించాలని నిర్ణయించారు.
ఏర్పాట్లు పూర్తి
సీఎం ప్రమాణ శ్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం తెలిపారు.
ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని జనం సహకరించాలని ఆయన కోరారు.
‘రెండు స్టేజీలు ఏర్పాటు చేసాం.మొదటి దానిపై గవర్నర్..క్రొత్త సీఎం.. చీఫ్ సెక్రెటరీ మాత్రం ఉంటారు.రెండో వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్..డీఎంకే చీఫ్ స్టాలిన్ లాంటి అతిధులు ఉంటారు’ అని సిఎస్ తెలిపారు.
స్టేడియం ఇన్నర్ సర్కిల్ లో పాసులు ఉన్నవాళ్లు, ఔటర్ సర్కిల్ లో పాస్ లు లేనివాళ్ళు సైతం కూర్చునేలా ఏర్పాటు చేశామని సిఎస్ చెప్పారు.
వీలైనంత నిరాడంబరంగా తన ప్రమాణ స్వీకారం ఉండాలని సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ తెలిపారనీ, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నామని సిఎస్ తెలిపారు.