అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గురువారం ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లినపుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పది రోజులు పడుతుందని జగన్ పేర్కొన్నారు. అయితే అన్ని రోజులు వ్యవధి తీసుకోకుండా ఇంకాస్త ముందుగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది.
మంగళవారం వైఎస్ జగన్, ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కానున్న మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంతో సమావేశమయ్యారు. తాను పదవి స్వీకరించిన వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. జగన్ ప్రాధామ్యాల్లో ముందున్న నవరత్నాల అమలు విధివిధానాలను కూడా సమీక్షించారు. ముఖ్యమైన ఏ పని చేయాలన్నా, విధాన నిర్ణయం ఏది తీసుకోవాలన్నా మంత్రివర్గం నిర్ణయం అవసరమని వారు జగన్కు వివరించారు. వెంటనే కార్యరంగంలోకి దూకాలంటే ఆలస్యం కాకుండా క్యాబినెట్ను ఏర్పాటు చేయాలని వారు సూచించారు. దానిమీదట వారంపది రోజులు కాకుండా వీలైనంత త్వరగా మంత్రిమండలిని కూర్చి పాలనను గాడిలో పడెయ్యాలని ఆయన నిర్ణయించారు.