తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి నేడు కాలినడకన కొండపైకి వచ్చి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన గరుడ ఆళ్వార్ సన్నిధిలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు సిఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షలు చేపడతామని వైవి అన్నారు. బంగారం వివాదాన్ని నిగ్గు తేలుస్తామని వైవి స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుల తొలగింపు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని వైవి వెల్లడించారు. టిటిడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వైవి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టిటిడి ఇఒ అశోక్కుమార్ సింఘాల్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు భుమన కరుణాకరరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి, సినీ నిర్మాత దిల్రాజు తదితరులు పాల్గొన్నారు.