ఢాక, డిసెంబర్ 31: రక్తసిక్తంగా ముగిసిన బంగ్లాధేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మూడవ సారి తన ఆధిక్యాన్ని కనబరిచింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలు కైవశం చేసుకుని అధికారాన్ని సుస్థిరపర్చుకుంది. ఎలక్షన్ కమీషన్ సెక్రటరీ హీలాల్ ఉద్దీన్ అహ్మద్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. అధికార అవామీ లీగ్ పార్టీకి 288 స్థానాలు సాధించడంతో హసీనా, నాల్గవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014 ఎన్నికలను బహిష్కరించిన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎస్పీ) ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకే పరిమితం అయ్యింది.
ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఈ ఎన్నికలను రద్దు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖ న్యాయవాది కమల్ హుస్సేన్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో జరిగిన అల్లర్లలో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జియా పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ మీర్జా షక్రుల్ ఇస్మామ్ అలంగీర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాలపై అలంగీర్ తన అభిప్రాయాలను ఇంకా వెల్లడించలేదు.