C Voter Survey: ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నా.. ప్రముఖ సర్వే సంస్థ ‘సీ ఓటర్-ఇండియా టుడే’ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని కావడం ఖాయమని తేల్చింది. ఏపీలో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి రెండోసారి సీఎం కావడం తథ్యమని చెప్పింది. దేశవ్యాప్తంగా బీజేపీకి, ఏపీలో వైసీపీకి ప్రజాదరణ తగ్గలేదని తేల్చింది. ఎన్డీఏకు 350 నుంచి 296కు సీట్లు తగ్గుతాయని.. బీజేపీ ఎంపీల సంఖ్య 303 నుంచి 271కి పడిపోయినా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తేల్చింది.
వైసీపీకే పట్టం..
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై (C Voter Survey) సీ ఓటర్ సర్వే విషయాలు ప్రతిపక్షాలకు ఝలక్ ఇచ్చాయనే చెప్పాలి. సీఎం జగన్ పై ప్రజావ్యతిరేకత ఉందనీ.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు.. వైసీపీ పని అయిపోయిందని టీడీపీతోసహా, విపక్షాలన్నీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే విషయాలు షాక్ ఇచ్చేవే. జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని.. ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకే పట్టం కట్టబోతున్నారని చెప్పింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే ఇందుకు కారణమని తేల్చింది. మూడు రాజధానుల అంశం ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాలేదని చెప్పింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కే అవకాశం లేదని తేల్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ మళ్లీ వైసీపీ-టీడీపీ మధ్యనే ఉండబోతోందని చెప్పకనే చెప్పేసింది.
విపక్షాల పరిస్థితి..
సీ ఓటర్ (C Voter Survey) ఇండియా టుడే సర్వే వైసీపీ శ్రేణులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చేదే అని చెప్పాలి. అయితే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం ఏపీలో ఊహించని విధంగా ప్రభుత్వోద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఖాయమని.. తమకు అనుకూలంగా ఉద్యోగులు మారతారని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 1.29లక్షల సచివాలయ ఉద్యోగాలు, 30 లక్షల ఇళ్లు, కరోనా సమయంలో కూడా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపైనే సీఎం జగన్ నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యా పరిష్కారమైతే.. సీ ఓటర్ – ఇండియా టుడే సర్వే నిజమయ్యే అవకాశాలే ఎక్కువ..!