టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నేతలను ఉద్దేశించి తాజాగా చేసిన హెచ్చరిక తెలుగు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్ మిషన్ 2019 విషయమై టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో గురువారం ఉదయం సిఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకమీదట ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసే టిఆర్ఎస్ నేతల పర్యటనల్లో టిడిపి నేతలు పాల్గొనవద్దని హెచ్చరించారు. అలా ఆ పార్టీ నేతలతో పాటు ఎవరైనా పర్యటనల్లో పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
బంధుత్వాలు వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి…స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. అంతే తప్ప బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టవద్దని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే అటువంటి చర్యలను సహించనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తెలంగాణా మాజీ మంత్రి, టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన టిడిపి శ్రేణులకు ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
అయితే చంద్రబాబు చేసిన ఈ హెచ్చరికలపై రాజకీయ పరిశీలకులు, మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఈ విషయమై ఎందుకు ఇంతలా రియాక్ట్ అయారనేది ఆయా శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ హెచ్చరికలు చంద్రబాబుని కలవరపరుస్తున్నాయా? …కెసిఆర్ సూచనలతోనే తలసాని ఎపి పర్యటన, తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారా?…టిఆర్ఎస్ నేతలు ఎపిలో కుల రాజకీయాల వంటివి రెచ్చగొట్టి ఇక్కడ అలజడి సృష్టించే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారా?…అందుకే పార్టీ శ్రేణులకు ఆ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారా?…అంటూ వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు.
అయితే పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రముఖంగా ఈ హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఆ విషయానికి అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లయిందని, అంతేకాకుండా ఎపిలో తమ ఉనికి చంద్రబాబులో ఆందోళన కలిగిస్తుందనే భావన టిఆర్ఎస్ నేతల్లో కలిగినట్లయితే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అది కెసిఆర్ సూచనలకు అనుగుణంగానైనా జరగొచ్చు లేదా ఆయనను మెప్పించేందుకైనా తమంతట తాము అటువంటి చర్యలకి పాల్పడవచ్చని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఎపి సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఊహించిన విధంగానే ఆ పార్టీ నేతలు ఘాటుగా ప్రతిస్పందిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు చేసేందుకు కారణంగా భావిస్తున్న టిఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎపి సిఎం చంద్రబాబు హెచ్చరికలను ఉద్దేశించి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ…”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయి” అన్నారు. అలాగే చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ అనేదే లేదని చెప్పారని, కానీ తమకు ఆయనలా కుట్ర, దొంగ రాజకీయాలు చేసే అలవాటు లేదని తలసాని చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా కేసీఆర్ ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల సీఎంలను, రాజకీయ పార్టీల అధినేతలను కలవడం జరుగుతోందని చెప్పారు.
ఎపిలో సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని…అక్కడ అవినీతి బాగా పెరిగిపోయిందని, అంతా ప్రచార ఆర్భాటమే కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ తాను పర్యటిస్తానని తలసాని వెల్లడించారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం వంటి అలవాట్లుకు చంద్రబాబుకేనని తమకి లేవన్నారు. బంధుత్వాలు,స్నేహాల గురించి అలా మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గు లేదా?…అయినా చంద్రబాబుకు బంధువుల గురించి, బంధుత్వం గురించి, వ్యక్తుల గురించి ఎలా తెలుస్తుందని తలసాని ఎద్దేవా చేశారు. ఎపిలో చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరూ ఏమీ అనరేమో కానీ, తెలంగాణాలో అలాంటి వ్యాఖ్యలకు జవాబులు చాలా సీరియస్గా ఉంటాయన్నారు.
రాబోయే 15,20 రోజుల్లో ఏపీకి కేసీఆర్ వస్తున్నారని…నీకు దమ్ముంటే…లేదా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనే ఆలోచన ఉంటే…కేసీఆర్ ఏపీకి వచ్చినప్పుడు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడాలని అన్నారు. అప్పుడు అభివృద్ధి ఎలా చేయాలో ఆయనే మీకు చెబుతారన్నారు. దీంతో ఒకవైపు టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తమ పార్టీనేతలను హెచ్చరించడం…మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై తెరాస నేతలు ఘాటుగా ప్రతిస్పందించడాన్ని బట్టి ఒక రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత రాజుకోవడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.