గుంటూరు: ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు తాను మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం జరిగిన రోడ్షోలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు మద్దతు విషయంపై తెలంగాణ సిఎం కెసిఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారనీ, ఆయనవి ఊసరవెల్లి రాజకీయాలని దుయ్యబట్టారు.
ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. ఇక్కడి కోడికత్తి పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
మోదికీ, కేసీఆర్, జగన్లు ఊడిగం చేయడానికి సిద్ధపడిపోయారని విమర్శించారు.
‘కేసిఆర్ నోటికొచ్చినట్లు తిడుతున్నారు. 60 సంవత్సరాల ఆస్తి దోచుకుని, ఇప్పుడు ఆంధ్రాకు వచ్చే నీళ్లును కూడా దోచుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేకహోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్వి ఊసరవెల్లి రాజకీయాలు. తెలంగాణ ఇస్తే, కాంగ్రెస్లో విలీనం చేస్తానని అప్పట్లో చెప్పారు. ఆ తర్వాత సోనియాగాంధీని రాక్షసి అన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సిఎం చేస్తానన్నాడు’ అని చంద్రబాబు గుర్తు చేశారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాహితం కోసం పనిచేశా. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి వెయ్యి రూపాయల పింఛన్ను రెండు వేల రూపాయలు చేశా మళ్లీ గెలిస్తే, మూడు వేల రూపాయలు చేస్తా. మీ పెద్ద కొడుకును గెలిపించుకునే బాధ్యత మీదే అని చంద్రబాబు అన్నారు.
పార్టీ అదికారంలోకి రాగానే చేయబోయే కార్యక్రమాలు వివరిస్తూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో టిడిపికి అధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.