“నేను మొదటి సారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించాను. 20 ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటని కొందరు అన్నారు. అలాంటి వాళ్ల మాటలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా కృషి చేశారు.
హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది“ ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కామెంట్లు.
30 ఏళ్ల ముందే….
బోంబే ఐఐటి విద్యార్ధులతో ‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’లో భాగంగా ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మన విజన్ ఎప్పుడూ దూరదృష్టితో ఉండాలి. మరో 30 ఏళ్ల ముందు ఆలోచనలు చేయాలి. 30 ఏళ్ల తర్వాత నువ్వెలా ఉంటావు, దేశం ఎలా ఉంటుంది, మన విజన్ ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వేం చేయాలి, దేశానికేం ఇవ్వాలి, సమాజానికేం ఇవ్వాలి అనేదానిపై మన ఆలోచనలు, కార్యాచరణ ఉండాలి.మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి.“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
నిద్రలేని రాత్రులే…
ఆలోచన, విజన్, కార్యాచరణ అనేది అతి ముఖ్యమని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘2050 నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పునకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది ప్రతి రోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. ఓటమి భయం ఉండకూడదు. రిస్కులను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ మార్చుకోవాలి.“ అని సూచించారు.
నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా?
మెగా మైండ్ సెట్ ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోండి అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. “2050 వైపు మీ ప్రయాణంలో మిమ్మల్ని మీరే, ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని ప్రశ్నించుకోండి. ఇరవై ముప్పై ఇళ్లు ఉండే కుగ్రామంలో నేను పుట్టాను. రోడ్డు, కరెంటు వసతులు లేని పల్లె నుంచి నేను వచ్చా. మనం ఎక్కడనుంచి వచ్చినా, ఏ స్థాయికి చేరామన్నది మన కృషిని ప్రతిబింబిస్తుంది. సామాన్యుడైన అబ్దుల్ కలామ్ అసామాన్యుడిగా ఎదిగారు, దేశానికే స్ఫూర్తిదాయకుడు అయ్యారంటే అదే..నాకే అన్నీ తెలుసు అనుకోరాదు. ప్రతి రోజూ నేను నేర్చుకుంటున్నా అనే భావంతో ముందుకెళ్లాలి.