వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అర్థం అవుతోంది.
ఎమ్మెల్యేలుగా ఉండగా పార్టీలో కొచ్చినప్పుడు తమకు బ్రహ్మరథం పట్టిన చంద్రబాబు ఇప్పుడు తమ మొఖం కూడా చూడడం లేదని వారు వాపోతున్నారు.మొన్నటి ఎన్నికల్లో మాత్రం వారిలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారందరికీ చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు.వారిలో అద్దంకి నుండి ఒక్క గొట్టిపాటి రవికుమార్ మినహాయిస్తే ఎవరూ గెలవలేదు.అయినప్పటికీ పాలపర్తి డేవిడ్ రాజు, ఆదినారాయణ రెడ్డి లను మినహాయిస్తే మిగిలిన 21మంది కూడా ఇప్పటికీ సాంకేతికంగా టిడిపిలోనే ఉన్నారు.అయితే వారినందరిని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారని భావన కలుగుతోంది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి శాసనసభలో ఉన్న బలం ప్రకారం ఎమ్మెల్సీ పదవిగానీ ఇంకో పదవి గానీ దక్కే అవకాశం ఎవరికీ లేదు.
కనీసం పార్టీ పదవి అయినా వస్తుందేమోనని ఎదురుచూసిన ఆ 21 మందికి నిరాశ తప్పలేదు. చంద్రబాబు తాజాగా ప్రకటించిన పార్లమెంటరీ జిల్లాల కమిటీల్లో ఈ జంపింగ్ జపాంగ్లు ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదు. పోనీ.. రెండేసి పార్లమెంటరీ జిల్లాలకు ఒక ఇంచార్జ్నునియమించినా ఆ పదవుల్లోనూ ప్రయార్టీ లేదు. చివరకు వైసీపీ నుంచి వచ్చి తన పార్టీలో చేరి మంత్రి పదవులు పొందిన సుజయ రంగారావు అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియలకు కూడా చంద్రబాబు పార్టీ పదవులు ఇవ్వలేదు.మరీ విచిత్రమైన విషయమేమిటంటే కాంగ్రెస్ నుంచి వచ్చిఆఖరి క్షణంలో టిడిపిలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి లాంటి వారిని ఆయన ఆదరించి పార్టీ పదవులిచ్చారు.
అలాగే పార్లమెంట్ నియోజక నియోజకవర్గాల వారీగా మహిళలకు కూడా చంద్రబాబు పదవులిచ్చారు.వారిలోనూ వైసీపీ నుంచి వచ్చిన మహిళలకు కూడా ప్రాధాన్యత లేదు.వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మహిళా నేతల్లోపాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, కర్నూలు జిల్లా జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే చరితారెడ్డి వంటివారు ఉన్నారు. వీరికి కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు.రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరికి మాత్రం పదవి ఇచ్చినా ఆమె డమ్మీనే.మహిళా నేతలకు పదవులు ఇవ్వాలంటే చాలా మంది ఫైర్బ్రాండ్లే ఉన్నారు.అయితే రాజేశ్వరికి మాత్రం పదవిచ్చి చంద్రబాబు మమ అనిపించారు.
చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయన వైసిపి నేతలను వాడుకుని వదిలేసినట్లే .తెలుగుదేశం పాత కాపులకే ఆయన పార్టీలో పెద్దపీట వేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే వైసిపి నుండి టిడిపిలో వచ్చిన వారిని ఆయన నమ్మడం లేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఉన్న పార్టీలో విలువలేదు. వైసిపిలోకి వెళదామంటే దారి లేదు ఏం చేయాలా అని ఆ ఇరవై ఒక్క మంది తలలు పట్టుకుంటున్నారట.మరి అలావుంటది చంద్రబాబు వాడకం!