(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : మూడు రాజధానుల ప్రకటన వెలువడిన తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉత్తరాంధ్రలో పర్యతీస్తున్నారు. విశాఖలో చంద్రబాబు ర్యాలీకి పోలీస్ అనుమతి లభించలేదు. పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ప్రజలకు పిలువు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతుందా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో కలుగుతోంది. చంద్రబాబు ర్యాలీ కి పోలీసులు అనుమతులు ఇవ్వకుండా పర్యటనకు ఆంక్షలు పెట్టడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నేడు విజయనగరం జిల్లా లోని ఎస్ కోట, గణపతినగరం, విజయనగరం నియోజక వర్గాలలో పర్యటించనున్నారు. తొలుత ఉదయం 11గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తరువాత పెందుర్తి మండలంలో పర్యటన ముగించుకొని 12.30 గంటలకు విజయనగరం జిల్లాకు వెళతారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖతో సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏమి చేసారని ప్రజా చైతన్య యాత్ర పేరుతో వస్తున్నారని అక్కడి వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పకుండా కేవలం అమరావతి మాత్రమే రాజధాని అంటున్న చంద్రబాబు తీరును వారు తప్పు పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో మాత్రమే చంద్రబాబు పర్యటించాలని, ఎలాంటి ర్యాలీలు చేయకూడదని పోలీస్ లు తెలియచేయడం, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నేటి చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్ట్ కు రాగానే ఆయనను అడ్డుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపు ఇవ్వడం పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.