ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ తెగ వాడేసుకుంటున్నాయి. తాజాగా టివి 5 కూడా ఆ వార్తని విపరీతంగా వాడేసుకుని అందరి కంటే ముందు తామే అన్నట్టుగా తెగ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. అదేమిటంటే “ముఖ్యమంత్రి జగన్ ని సెర్బియా పోలీసులు అరెస్టు చేస్తారట. వాన్ పిక్ కేసులో సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ ని అరెస్టు చేశారట.., నిమ్మగడ్డ అప్రూవర్ గా మారారట,
ఇక జగన్ ని కూడా అరెస్టు చేస్తారట”…! అసలు అరెస్టు చేస్తారో, చేయరో అనేది తర్వాత చూసుకుంటే ఆ ఛానెల్ అత్యుత్సాహమే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. రోజు డిబేట్ లు పెడుతూ, వైకాపా వర్గాలపై, నిమ్మగడ్డ, జగన్ పై విపరీత శాపనార్ధాలు పెడుతూ చర్చలు కొనసాగిస్తుంది. మళ్ళీ ఈ వార్తలపై, తమ శోధనలపై తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ రోదనలు వినిపిస్తుంది. ఇది సోసిల్ మీడియాలో కాస్త కామెడిగానూ…, మీడియా వర్గాల్లో వైపరీత్యంగాను.., సగటు మనిషిలో మీడియా అంటే విరక్తిగాను మారుతుంది.
వ్యతిరేకత చూపడం ఇలానా..?
సీఎం జగన్ అంటే వ్యతిరేకత ఉండొచ్చు. టివి 5 అనేది పక్కా టీడీపీ ఛానెల్ కావచ్చు. చంద్రబాబు మెప్పుకోసం పని చేయాలని ఉద్దేశం ఉండొచ్చు. కానీ మీడియా విలువలు దిగజారేలా ఊహాజనితంగా అనవసర డిబేట్ లు, కథనాలు వండి వారుస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్టుపై ఉన్నవి, లేనివి కలిపి చర్చిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అరెస్టు అయితే ఆ తర్వాత రోజుల తరబడి వేసుకోవచ్చు. డిబేట్ లు పెట్టుకోవచ్చు. కానీ అరెస్టుకి ముందే “జైలు పిలుస్తుంది” అంటూ ప్రసారాల్లో చూపడంలోనే ఆ మీడియా అత్యుత్సాహం తొణికిసలాడుతుంది. నిమ్మగడ్డని సెర్బియాలో రసెల్ అల్ ఖైమా అరెస్టు చేసిందట. అక్కడ నిమ్మగడ్డ నిజాలు అన్నిటినీ చెప్పేసి “అన్నిటికీ ఆ జగన్ కారణం. అతన్ని వదిలేసి నన్ను పట్టుకుంటున్నారు ఏంటి? ఆయన్ని అరెస్టు చేసుకోండి ” అంటూ చెప్తున్నారట. అందుకే సెర్బియా పోలీసులు జగన్ ని అరెస్టు చేయడానికి రెడీ గా బేడీలు పట్టుకుని తిరుగుతున్నారట” దీనిపై విశ్లేషకులు, నిపుణులు , పరిశోధకులు అంటూ డిబేట్ లు నిర్వహిస్తుంది టివి 5 . నిమ్మగడ్డ అరెస్టు నిజమే, కానీ అక్కడి విచారణలో అంశాలు ఏవీ బయటకు రావు. విచారణ ఏ దశలో ఉందనేది కూడా తెలియదు. కానీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలో ఇటువంటి ఊహాజనిత కథనాలు, డిబేట్ లు ప్రసారం చేయడం మీడియా అత్యుత్సాహమే. నిమ్మగడ్డ ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు. సెర్బియాలోనే ఉన్నారు, దేశం విడిచి వెళ్లరాదని షరతులతో అక్కడి న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ ముందుకు సాగితే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందుతుంది.