అంతర్వేదిలో రథం దగ్దమై రాజకీయంగా వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీలోని ఓ వర్గం, వీహెచ్ పీ, హైందవ సంఘాలు.. తీవ్రంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. ఈ వివాదంపై బీజేపీ, జనసేన ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నాయి. ఎన్నడూ లేనంతగా జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నాయి. మొత్తానికి రథం దగ్దం కేసు నాలుగు పార్టీల మధ్య రాజకీయ రచ్చగా మారి నలభై మందిని అరెస్టు చేసే వరకూ వెళ్లింది. అంతేకాకుండా.. సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేసేంద పెద్ద కేసుగా మారింది. అసలు అంతర్వేదిలో ఎవరు ప్రయోజనాలు ఎంత, ఎవరి వైఖరి ఏంటి, ఎవరి పోరాటం ఎంతో తెలుసుకోవాల్సి ఉంది.
ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఎలా జరిగింది..
ఈనెల 6వ తేదీ తెల్లవారుఝామున అంతర్వేదిలో రథం దగ్దమైంది. విషయంత దావానంలా వ్యాపించడంతో భక్తులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు సంఘటనా స్థలం వద్ద ఆందోళనలు చేశారు. దీనిపై టీడీపీ సొంతంగా నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవాదాయ శాఖ స్పందించి అదనపు కమీషనర్ తో విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరిలోపు కొత్త రధాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం 96 లక్షలు కేటాయించింది. అంతర్వేదిలో పర్యటించిన మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణలను విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ధార్మిక సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం అంతకంతకూ పెరగడం, రాజకీయంగా ఒత్తిడులు రావడంతో ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
సీబీఐ విచారణతో జగన్ ఏం చెప్పదలచుకున్నారు..
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. అందుకే ఎటువంటి సంచలనాత్మక కేసు అయినా సీబీఐకి అప్పగించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక కేసులను సీబీఐకి అప్పగించిన జగన్ ప్రభుత్వం అంతర్వేది రథం దగ్దం కేసును కూడా సీబీఐకి అప్పగించింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ పోలీసుల విచారణ జరిపిస్తే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని విచారణలో ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది.