దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో దేశ రాజధాని ఢిల్లీ కూడా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా కట్టడి చేయడంలో తీసుకున్న నిర్ణయాల వలన ఇప్పుడు ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్లాస్మా తెరఫీ విధానం ద్వారా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అక్కడ కరోనా రికవరీ రేటును పెంచినట్లు సమాచారం.
ఇందువల్లే గత కొద్దిరోజులుగా ఢిల్లీ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య గతంలో కంటే చాలా వరకు తగ్గిపోయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా ఒక వెయ్యి నూట నలభై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య విషయంలో ఈ నెంబర్ చాలా తక్కువ అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలావరకు కరోనా వైరస్ ని కంట్రోల్ చేయగలిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఢిల్లీ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,531 కాగా వీరిలో కోలుకున్న వారి సంఖ్య 1,13,068. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసులు 12,657…ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.