విశాఖ: రాజధాని అమరావతిపై సిఎం జగన్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జగన్ మౌనం ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి దశదిశ నిర్ణయించేది రాజధానేనని గంటా అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు అయిన తర్వాత రాజధానిపై చర్చ జరగడం బాధాకరమని గంటా వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కోరకంగా మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. అమరావతిలో అవినీతి జరిగితే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని గంటా స్పష్టం చేశారు. విశాఖ పట్టణాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు.
కాగా వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే ఉంటుందని పేర్కొన్నారు.