Yadadri: తెలంగాణలో అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా తేలికపాటి వర్షం కురిసింది. దాదాపు గంటన్నర సేపు కురిసిన ఈ వర్షానికి యాదాద్రిలో రోడ్లు మొత్తం కుంగిపోయాయి. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి చూసి చాలా మంది భక్తులు కాంట్రాక్టర్లు మరియు అధికారుల పనితీరు పై అసహనం వ్యక్తం చేశారు. ఒక వర్షానికే ఇంతలా డ్యామేజ్ అవుతుందా..? నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. అయితే ఇదే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఏర్పాటుచేసిన పందిళ్ళు కూడా కూలిపోయాయి. అంతమాత్రమే కాదు క్యూ లైవ్ లోకి కూడా వరద నీరు రావడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నీ ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రం గా అనేక అభివృద్ధి పనులు నిర్మిస్తూ దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఈ క్రమంలో చిన్నపాటి తేలిక వర్షానికి రోడ్డు దెబ్బ తినడంతో పాటు ఆలయం లోకి నీరు చేరటంతో తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
కొత్తగా నిర్మించిన మూడో ఘాట్ రోడ్డు వాన దాటికి కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ఇక ఇదే సమయంలో కొండపైకి వెళ్లే రెండు బస్సులు బురదలో దిగడంతో.. బుధవారం కొండపైకి బస్సు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో చాలా మంది భక్తులు మెట్లమార్గంలో కొండ పైకి వెళ్ళారు. ఇదిలా ఉంటే కొండపై పార్కింగ్ ఫీజు లో గంటకు వంద రూపాయలు వసూలు విధానాన్ని భక్తుల కోరిక మేరకు తొలగిస్తున్నట్లు సరైన సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు.. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయాన్ని సందర్శించి తెలియజేశారు.