Ap Assembly: రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం 2021-22 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ నాయకుడు చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ బడ్జెట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం చూస్తే అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో పెద్ద అద్భుతాలు ఏమీ లేవని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి.. రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని మనోహర్ విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ప్రజలు తమ ప్రాణాలు కాపాడాలని రోదిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ని పొగడటానికి మంత్రులు కొటేషన్లు మరియు పద్యాలు అసెంబ్లీలో చదవటం దారుణమని విమర్శించారు. అదే రీతిలో వైద్యనిపుణులు దేశంలో ఈ ఏడాదిలోనే థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెబుతున్నారు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలన విషయంలో ప్రభుత్వం విఫలమైందని అది మీకు కనబడటం లేదా అంటూ ఎద్దేవా చేశారు.
సంక్షేమం విషయంలో భారీగా కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా గాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఆరోగ్య శాఖకు అధికంగా నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా మరి బయట కరోనా ఎందుకు కట్టడి కావడం లేదని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు చూస్తుంటే అంకెల గారడీ తప్ప ఏమీ లేదు అన్నట్టు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శల వర్షం కురిపించారు.