(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
బీజెపీ పార్టీ వైఖరికి భిన్నంగా మీడియాలో మాట్లాడుతున్నారన్న అభియోగంపై లంక దినకర్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం అయిన కొద్ది రోజులకే లంక దినకర్ కు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే ఈ షోకాజ్ నోటీసుకు దినకర్ సమాధానం ఇవ్వలేదు. టీవీ చర్చల్లో పాల్గొంటూనే ఉన్నారు. దీంతో బీజెపి ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
గతంలో టీడీపీలో యాక్టివ్ గా పని చేసిన దినకర్ బీజెపిలోకి వచ్చిన తరువాత కూడా టీడీపీ బాణీనే వినిపిస్తున్నారనేది పార్టీ నాయకుల వాదన. రాష్ట్ర బీజెపి పగ్గాలు సోము వీర్రాజు స్వీకరించినప్పటి నుండి రాష్ట్రంలో అమరావతి విషయంలో గానీ ఇతర విషయాల్లో గానీ పార్టీ వైఖరి మారిన విషయం తెలిసిందే. అయితే దినకర్ మొదటి నుండి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా చర్చా వేదికలో మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో రాజధాని అమరావతి విషయంలో బీజెపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన తరువాత వరుసగా ఇప్పటికి ముగ్గురు నేతలను సస్పెండ్ చేశారు.