ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ షాకిచ్చారు. బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవటంతో ఉదిత్ రాజ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
వాయువ్య ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదిత్ రాజ్ తనకు టికెట్ ఖరారు చేయకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని మంగళవారం ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం ఆ నియోజకవర్గ అభ్యర్థిగా పంజాబ్కు చెందిన సింగర్ హాన్స్ రాజ్ను ప్రకటించింది. దీంతో ఉదిత్ రాజ్ బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఐఆర్ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లాపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో ఉదిత్ రాజ్ విజయం సాధించారు.