‘కింద పడ్డా.. పై చేయి నాదే అని బండగా మొండిగా..’ అంటూ ఖుషి సినిమాలో పవన్ కల్యాణ్ ఓ డైలాగ్ చెప్తాడు. అలా ఉంది రాజు గారి తీరు. ఇప్పటికే రెబల్ ఎంపీగా గెలిచిన పార్టీపైనే పగ సాధిస్తున్న రాజు గారికి స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఊడిపోయింది. అయితే.. ఎంపీగారి బుకాయింపు ఎలా ఉందంటే.. ‘ఆ పదవీ కాలం అయిపోయింది కాబట్టి నన్ను తీసేశారు’ అంటూ బీరాలు పలుకుతున్నారు. పనిలోపనిగా.. సీఎం జగన్ మతస్థుడికే ఆ పదవి ఇచ్చుకున్నారు అంటూ తన మార్కు సెటైర్ వేశారు. ‘నీ ముక్కు ఏదీ అంటే.. తల చుట్టూ చేయి తిప్పి చూపించినట్టు’ ఉంది ఎంపీ గారి తీరు. మొన్నామధ్య పార్లమెంట్ లో సీటింగ్ ప్లేస్ మార్చారు.. ఇప్పుడు పదవి తీసేశారు. ఇక మిగిలింది అనర్హత వేటు. వైసీపీకి బీజేపీకి ఉన్న మిత్రుత్వంతో ఆ ముచ్చట కూడా తీరిపోనుందా..!
పార్టీకి ఊరడింపు మాత్రమే దక్కిందా..
నిజానికి రఘురామకృష్ణ రాజు విషయంలో వైసీపీ కావాలనుకున్నది ఇది కాదు. సాక్షాత్తూ సీఎం, పార్టీనే ఎండగట్టేస్తున్నారు. పార్టీ పేరే మీది కాదని.. మళ్లీ నోటీసు ఇవ్వలేని పరిస్థితులు కల్పించుకున్నారు. దీంతో.. పద్దతి ప్రకారం ఎంపీకి చెక్ పెట్టాలని భావించారు సీఎం జగన్. ఈమేరకు రాజుగారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చారు. మొన్న సీటింగ్ ప్లేస్, ఇప్పుడు పదవి తీసేసినా.. రెండింటి విషయంలో రెబల్ ఎంపీ తన వాదనే బలంగా ఉంది గానీ.. వైసీపీకి ఒరిగిందేమీ లేదు.
సీఎం జగన్ వ్యూహమేంటి..
పార్టీ అధినేత, రాష్ట్రానికి సీఎం అనే ఊహే లేకుండా రఘురామకృష్ణ రాజు విమర్శలు చేయడం జగన్ కు మనశ్శాంతి లేకుండా చేసే విషయమే. అయితే.. రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తున్న ఎంపీపై ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కోటిగా రెబల్ ఎంపీపై చర్యలు పడుతున్నాయని కొందరు అంటున్నారు. ప్రస్తుతం వైసీపీపై బీజేపీకి సానుకూల ధృక్పదమే ఉంది. ఈ నేపథ్యంలో రెబల్ ఎంపీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయడం పెద్ద సమస్య కాదు. అయితే.. అనుకూల పరిస్థితుల కోసం వేచి చూస్తున్నారనే వాదన ఉంది. అందుకోసమే సీఎం జగన్ సైలెన్స్ గా ఉన్నారని అంటున్నారు.