ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..
ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి
చంద్రబాబు డైరెక్షన్లో ఈసి రమేష్ కుమార్ నడుస్తున్నారు. అందుకు బాబు మాటలే నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులపాలు చేయాలనే కుట్రతోనే ఈసితో చంద్రబాబు చేతులు కలిపి ఎన్నికలు వాయిదా వేయించారు.
ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విదేశాల నుండి వచ్చిన వారు ఇళ్లల్లోనే ఉండాలి. వారి కోసం హోమ్ ఐసోలేటెడ్ చర్యలు చేపట్టాం. విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల క్వారెంటైన్ ఫెసిలిటీస్లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తేలిన తర్వాతే ఇళ్లకు పంపుతున్నాం. ఇప్పటి వరకూ ఏడు వేల మంది తెలుగువారు విదేశాల నుండి ఏపికి వచ్చారు. ఇటలీ, స్పెయిన్, ఇరాక్, సౌత్ కొరియా, జపాన్ నుండి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు
సిఎం జగన్మోహనరెడ్డి కులాల గురించి మాట్లాడటమేమిటి. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది. ఈసిపై జగన్ వ్యాఖ్యలు సిఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు, కేంద్రం నిధుల విడుదలకు సంబంధం లేదని రమేష్ కుమార్ చెప్పినా వైసిపి నేతలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. జగన్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి.
టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించినా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదు. కరోనా భయంతో జనం వణికిపోతుంటే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. స్పీకర్ పదవికి తమ్మినేని అనర్హలు, వైసిపి నేతలు కోర్టు ముందు డిజిపి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు.
టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు
సిఎం జగన్ తీరుతో భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ను విమర్శించే హక్కు జగన్కు ఎవరిచ్చారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడితే నిధులు రావనేది అవాస్తవం. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల వాయిదాను కేంద్రం కూడా తప్పుబట్టదు. అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎన్నికలు వాయిదా కాదు, రీ నోటిఫికేషన్ ఇవ్వాలి. వైసిపికి సహకరిస్తున్న అధికారులపై డీవోపీటిలో పిటిషన్ వేస్తాం.
వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
చంద్రబాబుకు ఇంకా మైండ్ సెట్ మారలేదు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇసి రమేష్ కుమార్, చంద్రబాబు కుట్ర వల్లనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు కరోనా కారణంగా చెప్పడం సరికాదు.