శంషాబాద్, మార్చి 9 : ప్రధాని నరేంద్ర మోది భారత్ ను రెండు ముక్కులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ మోదీపై విమర్శలు గుప్పించారు. భారత్లో ఒక భాగాన్ని ధనికుల కోసం మోది కేటాయించారని విమర్శించారు. పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా మోది వ్యవహరిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయినా పట్టించుకోరని రాహుల్ విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై కూడా రాహుల్ విమర్శలు చేశారు. ‘ నోట్ల రద్దుకు కేసిఆర్ మద్దతిచ్చారు. జిఎస్టి విషయంలో కేసిఆర్.. మోదీకి సర్టిఫికెట్ ఇచ్చారు. రాఫెల్ కొనుగోళ్లలో మోది వేలకోట్లు అంబానీకి దోచిపెట్టే యత్నం చేశారు. రాఫెల్ విషయంలో కేసీఆర్ ఎన్నిసార్లు ప్రశ్నించారు?. ఒక్కసారైనా మోదీని కేసీఆర్ ప్రశ్నించారా?. మోదీనే ప్రధానిగా కొనసాగాలని కేసీఆర్ ఉద్దేశం. కేసిఆర్ అవినీతి చిట్టా మోది చేతిలో ఉంది. అందుకే కేసిఆర్ మోదీకి మద్దతిస్తున్నారు” అని కేసిఆర్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
‘ మోదీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం జరుగుతోంది. నేను ఎట్టి పరిస్థితుల్లో భారత్ను రెండు ముక్కలు కానివ్వను. ఒకే భారత్ ఉంటుంది. అందులో పేద, సంపన్నుల తేడా ఉండదు. దేశంలోని ప్రతి పేదవాడికి కనీస ఆదాయం వచ్చే విధంగా పెద్ద చారిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నాను. భారత్లోని ఏ పేదవాడి ఆదాయం మేము ఇచ్చే కనీస ఆదాయం కంటే తక్కువ ఉండకుండా చూసుకొంటాను. ఈ విషయంలో జాతి, కుల, ప్రాంతీయ తారతమ్యాలు ఉండవు. ప్రతి పేదవాడి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చేలా ఈ పాలసీని అమలు చేస్తాను’ అని రాహుల్ హామీ ఇచ్చారు.
‘ మోది ప్రభుత్వంలో నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ వంటి చట్టాలను తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచారు. లక్షల మంది రోడ్లపై పడ్డారు. నోట్ల రద్దు నష్టానికి నేను ఏమీ చేయలేను. కానీ, 2019లో గబ్బర్ సింగ్ ట్యాక్స్ను సరైన జిఎస్టిగా మార్చేస్తాను. చిరు వ్యాపారాలు చేయాలనుకునే వారికి రుణాలు వచ్చేలా చేస్తాను. రైతులు భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ మీతోనే ఉంది. మోది మీ భూములను గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోను. మీ తరపున పోరాడతాను. గతంలో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చాము’ అని రాహుల్ అన్నారు.