రజనీకాంత్… పరిచయం అవసరం లేని పేరు. భారతదేశంలోనే కాకుండా భారతీయ సినిమాల గురించి అవగాహన ఉన్న వారెవ్వరికీ ఈ పేరు, ఈ స్టార్ గురించి వివరించనవసరం లేనంత స్టార్ డమ్ ఆయనది. భారతదేశంలోనే కాకుండా రజనీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది.
కబాలీ సినిమాకు పెద్ద పెద్ద సంస్థల సైతం ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ సినిమా చూసుకోమని ప్రకటించే అంత ఫాలోయింగ్ ఆయన సొంతం. అంతటి పాలోయింగ్ ఉన్న రజనీ తమిళనాడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఊగిసలాట కొనసాగింది. అభిమానులు ఎప్పుడెప్పుడు పార్టీ పెడతాడా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎవరికి దెబ్బ పడనుందనే చర్చ సాగుతోంది.
దటీజ్ రజనీ..
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై ఇన్నాళ్లు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడును మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి, సూపర్ స్టార్ “ప్రజల కోసం సాధ్యమైనంతవరకు శక్తి మేరకు పని చేస్తా.. మనం చేయకపోతే మార్పు ఎప్పటికీ జరగదు” అని ఆయన అన్నారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిపిన ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
అప్పుడే గెలుపు గురించి లెక్కలు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తన ప్రణాళికలు ప్రభావితమయ్యాయని, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండటానికి ఇష్టపడలేదని రజనీకాంత్ మీడియాతో అన్నారు. రాజకీయాల్లో తన విజయం ప్రజల విజయమేనని అన్నారు. “ఇదంతా తమిళనాడు ప్రజలపై ఆధారపడి ఉంటుంది. నేను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు గెలిస్తే అది ప్రజల విజయం అవుతుంది” అని అన్నారు.
తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తా.. సమూలంగా మార్చేస్తానని అన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో ఇప్పటికే సమావేశం అయ్యారు.
రజనీ లెక్కేంటో తెలుసా?
రజనీ పార్టీ తమిళ రాజకీయాల్లో భూకంపాన్నే సృష్టించనుంది. తమిళనాడులోని రెండు పార్టీలను టార్గెట్ చేయడం లక్ష్యంగా రజనీకాంత్ ఉన్నారని అంటున్నారు. 50 ఏళ్లుగా తమిళ ప్రజలు రెండు పార్టీలతో విసిగిపోయారని, మూడో ప్రత్యామ్నాయం అవసరం అని 2017లోనే రజనీకాంత్ ప్రకటించారు. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే నామ్కేవాస్తీ అన్నట్లుగా ఉంది. ఇందులోని ముఖ్య నేతలు రజనీ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. డీఎంకే ముఖ్య నేత అళగిరి సైతం చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. ఆయన కాకపోయినా డీఎంకేలోని ముఖ్యనేతలు సైతం రజనీ పార్టీలోకి జంప్ కావచ్చునని చెప్పుకొస్తున్నారు. రజనీ కేంద్రంగా ప్రాంతీయ పార్టీలను చీల్చే ఎత్తుగడ సైతం బీజేపీ అమలు చేస్తుందా అనే చర్చ మరోవైపు సాగుతోంది.