టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలతో సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలుగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిలతో పాటు జిల్లా ఇన్ చార్జి లను పిలిపించుకుని చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు 75 నియోజకవర్గాల ఇన్ చార్జిలతో (ఒన్ టు ఒన్) ముఖాముఖి భేటీ జరిపి ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. మరో రెండు మూడు నెలల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జిలతో మాట్లాడాలనేది టీడీపీ టార్గెట్. అయితే ఇప్పటి వరకూ జరిగిన రివ్యూల్లో పాల్గొన్న ఇన్ చార్జిల్లో చాలా మంది అభ్యర్ధిత్వాల విషయంలో డౌట్ ఫుల్ గా ఉన్నవాళ్లే. నూటికి నూరు శాతం కన్ఫర్మ్ అనుకున్న వాళ్లు కాదు. అందుకే ఈ 75 మందిలో ఎంత మందికి టికెట్ లు ఇస్తారు..? ఎంత మందికి టికెట్లు నిరాకరిస్తారు.? అనేది ఆలోచించాల్సిన అంశం.
30 మంది ఇన్ చార్జిలకు టికెట్ లు అనుమానమే..
నిజానికి చంద్రబాబును కలిసి వచ్చిన ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ చార్జి కూడా “నాకు టికెట్ కన్పర్మ్ చేశారు. నాకే ఇస్తాను అన్నారు. చేసుకోమన్నారు” అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా, వాళ్ల అనుచరుల ద్వారా ప్రచారం చేసుకుంటుండగా, కొన్ని చోట్ల అయితే ఆ ఇన్ చార్జిల అనుచరులు టపాసులు పేల్చి సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే చంద్రబాబును కలిసిన ప్రతి ఒక్కరికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లేనా..? వీళ్ల ప్రచారంలో వాస్తవం ఉందా..? అనేది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే.. భవిష్యత్తులో కశ్చితంగా మార్పులు ఉంటాయి. సామాజిక సమీకరణల్లో మార్పులు ఉంటాయి. అంతే కాకుండా వైఎస్ఆర్ పార్టీ వేసే అడుగులను బట్టి మార్పులు ఉంటాయి. వాళ్ల అభ్యర్ధులను బట్టి మార్పులు ఉంటాయి. అలానే పొత్తుల పరంగా కొన్ని మార్పులు ఉంటాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఉంటే కొన్ని వాళ్లకు ఇవ్వాల్సిన నేపథ్యంలో టీడీపీ ఇన్ చార్జిలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ జరిగిన 75 నియోజకవర్గాల రివ్యూల్లో దాదాపు 25 నుండి 30 మంది ఇన్ చార్జిలకు టికెట్ డౌటే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ల పనితీరు పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనీ, వాళ్లకు చంద్రబాబు క్లాస్ పీకారని టీడీపీ అంతర్గత వర్గాల నుండి అందుతున్న సమాచారం.
టీడీపీ నేత చింతకాయల విజయ్ కి ఏపి సీఐడీ నోటీసులు ..స్పందించిన చంద్రబాబు, లోకేష్
ఆ జిల్లాల్లో ఎక్కువ మంది త్యాగాలకు సిద్దం కావాలి
చంద్రబాబు, నియోజకవర్గ ఇన్ చార్జి మధ్య ఒన్ టు ఒన్ మీటింగ్ లో బాదుడే బాదుడు కార్యక్రమం, సభ్యత్వ నమోదు, పార్టీ పరంగా చేయబోయే ప్లాన్లు ఏమిటి తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. అప్పటికే చంద్రబాబు వద్ద ఉన్న నివేదిక అధారంగా వాళ్ల పని తీరుపై బాగుంటే బాగుందనీ, బాగోలేకపోతే మెరుగుపర్చుకోవాలని చెబుతారు. అయితే చంద్రబాబుతో మీటింగ్ అయిన తరువాత నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలు బయటకు వచ్చి తనకు చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేశారు అని చెప్పుకోవడం పట్ల పార్టీ అసౌకర్యంగా ఫీల్ అవుతోంది. రివ్యూల సమయంలోనే ఒక వేళ పొత్తులు ఉంటే సీటు త్యాగం చేయాల్సి వస్తుందని కూడా చంద్రబాబు కొందరికి చెప్పినట్లుగా తెలుస్తొంది. పార్టీల పొత్తులకు సంబంధించి మరో రెండు మూడు నెలల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అప్పుడు ముఖ్యమంగా ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ మంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే కొందరు త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉండాలని చంద్రబాబు గతంలో పరోక్షంగా చెప్పారు. పార్టీ టికెట్ కన్పర్మ్ చేయకముందే ఇన్ చార్జిలు నియోజకవర్గాల్లో తామే అభ్యర్ధులమని చెప్పుకోవడం, దానికి భిన్నంగా పార్టీ వర్గాలు చెబుతుండటం పార్టీలో ఒక రకంగా అనిశ్చిత పరిస్థితి కనబడుతోంది.
రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపిలో అయిదు రోజులు .. ఈ నెల 17 నుండి..