ఇటీవల వర్షాలు బాగా కురియడంతో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లన్నీ జలమయం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వాన కురియడంతో.. ప్రాణ నష్టంతో పాటు రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయాయి. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… విపక్షాలు హైదరాబాదులో వరద పరిస్థితులను అవకాశంగా తీసుకుని టిఆర్ఎస్ పార్టీని ఏకిపారేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ షాకింగ్ కామెంట్ చేశారు. విశ్వ నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీదే అంటూ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు సంవత్సరాలు నిర్లక్ష్య పరిపాలన వల్ల నగరంలో ప్రజలు వస్తున్న వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వాతావరణ శాఖ అందించిన హెచ్చరికలు లెక్కచేయకుండా ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే చాలామంది వర్షాల వల్ల చనిపోయినట్లు శ్రావణ్ తెలిపారు. మృతిచెందిన వారి విషయంలో తప్పుడు లెక్కలు టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుంది అంటూ… మండిపడుతూ సరైన సమాచారం తమ దగ్గర ఉందని చెప్పుకొచ్చారు.
ఇంత దారుణంగా కుండపోత వర్షం పడుతుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఎలాంటి బాధ్యత లేదు అన్నట్టుగా వ్యవహరించారని, కానీ పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రివ్యూ మీటింగ్ మీద రివ్యూ మీటింగ్ లు పెడుతూ…. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అలర్ట్ చేశారని శ్రావణ్ తెలిపారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చెట్లమీద రివ్యూ చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు రివ్యు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ఇంకా కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు వర్షాలు వరదలు డీల్ చేసే విషయంలో జగన్ ని పొగుడుతూ కెసిఆర్ ని విమర్శించినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.