Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకి లో వాలంటీర్ల సత్కార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ సీఎం జగన్ మరియు మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో విశిష్ట సేవలు అందించిన కొంతమంది వాలంటీర్ల పనితనాన్ని గుర్తించి వారిని సత్కరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలు అయ్యే విషయములో వాలంటీర్ల పనితనం నిజంగా అమోఘం అంటూ జగన్ కొనియాడారు.
ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నుండి అదేవిధంగా కొన్ని పార్టీలకు కొమ్ముకాసే చానళ్ల నుండి వచ్చే విమర్శలను పట్టించుకోకుండా సేవలు అందించాలని కోరారు. అంతేకాకుండా జీవితంలో క్రమశిక్షణ కలిగి తప్పు చేయకుండా.. పని చేసుకుంటూ పోతే, ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులు తాయి అని .. వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రశంసించారు. ఇదే సమయంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్..ప్రధాని అయితే చాలా బాగుంటుంది అని దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది పేదవాళ్ళు అనుకుంటున్నట్లు పార్థసారథి పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న జగన్..ముసి ముసి నవ్వులు నవ్వగా..వాలంటీర్లు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు చప్పట్లతో సభను హోరెత్తించారు. జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు మరియు పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది.