అమరావతి: యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఆత్మకూరు డ్రామా ఆడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. టిడిపి చలో ఆత్మకూరు పిలుపుపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు.
పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చచేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టిందని విజయసాయి విమర్శించారు. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలిందని ఆయన పేర్కొన్నారు. అక్కడ ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేనట్లు అర్థమవుతోందని విజయసాయి వ్యాఖ్యానించారు.
నిద్రపట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడన్న సామెత మాదిరిగా చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా చంద్రబాబు ఇప్పుడే మొదలు పెట్టారని అన్నారు. చిత్తు చిత్తుగా ఓడి వంద రోజులే అయింది చంద్రబాబూ అని విజయసాయి గుర్తు చేశారు.
‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు గారూ’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.