2014 ఎన్నికలు గమనిస్తే అప్పటికే జగన్ కి విశాఖపట్టణం పై కన్ను ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు తల్లి విజయమ్మ ని వైజాగ్ నుండి పోటీ చేయించడం మనకందరికీ తెలిసిందే. కానీ జరిగిన ఎన్నికలలో విజయమ్మ ఇటు పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ఏడాది పరిపాలనలో తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలలో ఒకటి విశాఖపట్టణం రాజధానిగా గుర్తించటం. అభివృద్ధి అంతట జరగాలని రాజధాని వికేంద్రీకరణ పేరిట అసెంబ్లీ లో మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకు వచ్చిన జగన్ అందరి దృష్టి వైజాగ్ నగరంపై పడేలా చేశారు.
ఏడాది పరిపాలనలోనే విశాఖపట్నం జిల్లాకు అనేక వరాలు కురిపించారు. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి ట్రామ్ రైలు.. పోలవరం నుంచి జలాల తరలింపు.. గిరిజనుల కోసం వైద్య కళాశాల.. మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్ హార్బర్.. నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.1300 కోట్లతో నగరాభివృద్ధి పనులు.. పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు డీశాలినేషన్ ప్లాంట్.. ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాన్సెప్ట్ సిటీ.. వంటివి ప్రకటించారు.
ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ తాజాగా వైజాగ్ ప్రజలకి గుడ్ న్యూస్ అందించారు. అదేమిటంటే వైజాగ్ పట్టణంలో 24 గంటలు నగర ప్రజలకు తాగునీరు అందేలా 3,600 కోట్ల అంచనా వ్యయంతో పైప్లైన్ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. మొత్తంమీద చూసుకుంటే అతి తక్కువ టైమ్ లోనే, తక్కువ ఖర్చుతోనే విశాఖపట్టణానికి రాజధానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటయ్యేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థం అవుతోంది.