వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆ యువతీ యవకుడికి వాలంటీర్ పోస్టులు వచ్చాయి. సొంత ఊరిలో ఉద్యోగాలు, ఏ చీకు చింత లేదనుకున్నారు. ఏమి జరిగిందో ఏమో కానీ ఆ యువతి ఆత్మహత్య చేసుకొని అసువులు బాయగా, ఆ యువకుడు కటకటాల పాలయ్యాడు. సంచలనం కల్గించిన ఈ సంఘటన గుంటూరు జిల్లా దుండిపాలెం గ్రామంలో జరిగింది.
దుండిపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్న బాంధవి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీనివాస్తో ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణంగా అనుకుంటున్నారు. శ్రీనివాస్ వేధింపుల కారణంగానే తన కుమార్తె బాంధవి ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు శ్రీనివాస్కు దేహశుద్ధ చేసి పోలీసులకు అప్పగించారు.
బాంధవి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాంధవి, శ్రీనివాస్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నదా, లేక శ్రీనివాస్ ఆమెను వేధించాడా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు, సౌకర్యాలు ప్రజల ఇంటి వద్దకే చేరాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థలో అక్కడక్కడా కొందరి వల్ల అభాసుపాలవుతోంది. గ్రామ వాలంటీర్ వేధింపులతో రెండు రోజుల క్రితం విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.