గత ఏడాది ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం.. ప్రస్తుతం మళ్లీ ఆసక్తి రేపుతోంది. అదే.. తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించుకోవడంపై సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ఆమధ్య సంచలనం రేపింది. అప్పట్లో అందరూ స్టీఫెన్ రవీంద్ర దాదాపు వచ్చేసినట్టే భావించారు. జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగినా.. కేంద్ర హోంశాఖ వద్ద మాత్రం పెండింగ్ లో పడింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇదే అంశం ప్రధానంగా వార్తలో నిలుస్తోంది. జగన్ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ వార్త ఇంకా హైలైట్ కాకముందే తెలుగుదేశం పార్టీ అప్పుడే హైలైట్ చేస్తోంది. ఇందుకు టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ట్వీట్ ఉదాహరణగా నిలుస్తోంది.
టీడీపీ భయపడుతోందా..?
ఉమ్మడి ఏపీలో పోలీసు అధికారిగా పనిచేసిన వర్ల రామయ్య ఈ విషయంపై స్పందించారు. అసమర్ధమైన పాలన నడుస్తున్న రాష్ట్రానికి స్టీఫెన్ రవీంద్ర ‘ఇంటెలిజెన్స్ చీఫ్’ గా వస్తారని ఆయన తెలిసిన వానిగా నేననుకోను అంటూ ట్వీట్ చేశారు. నిజానికి సీఎం జగన్ ఇందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారికంగా వార్త రాలేదు. ఇటువంటి విషయాల్లో స్పందించి విషయాన్ని రాజకీయం చేయడం టీడీపీకి ఉన్న అలవాటే. ఏపీ ప్రభుత్వాన్ని తప్పబట్టడం, ప్రజల్లో కొత్త ఆలోచనలు రేపడంలో టీడీపీ తన గేమ్ మొదలుపెట్టేసింది. నిజానికి.. ఏపార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుకూలమైన అధికారులనే ఉన్నత పదవుల్లో నియమిస్తుంది. గతంలో టీడీపీ కూడా ఇదే చేసింది. అయితే.. స్టీఫెన్ రవీంద్రపై ముందుగానే వ్యాఖ్యలు చేసి ఆయనపై కూడా ఒత్తిడి తెచ్చే క్రమంలోనే వర్ల రామయ్య వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.
జగన్ నమ్మకం అదే..
ఉమ్మడి ఏపీలో స్టీఫెన్ రవీంద్ర వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీగా చేశారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తారనే పేరు ఉంది. అందుకే జగన్ ఆయన్ను రాష్ట్రానికి రప్పించేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. ఇటివలి అమిత్ షాతో భేటీ సమయంలో కూడా ఈ ప్రస్తావన తెచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రతిపక్షాల కదలికలపై సమాచారం తెప్పుంచుకునే క్రమంలో స్టీఫెన్ రవీంద్రపై జగన్ నమ్మకం ఉంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటివల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.