Advocates murder case : న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల దారుణ హత్యపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. హత్యపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నిర్ధిష్ట కాలపరిమితితో దర్యాప్తును పూర్తి చేయాలని సూచించింది. ఈ సందర్భంగా దర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదుల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయవాదుల హత్య గర్హనీయమని పేర్కొంది. ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. సాక్షాధారాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచిస్తూ విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని – పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలు వందలాది మంది చూస్తుండగా నరికి చంపిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అనుచరులే ఈ హత్యలు చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును హైకోర్టు న్యాయవాదులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసుల కంటే ముందే న్యాయవాదులే దీనిపై విచారణ చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది.
మరో పక్క న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్ లు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. గురువారం విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు బార్ ఆసోసియేషన్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులు, నాంపల్లి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, కుకట్పల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. న్యాయవాదుల ఆందోళనలో బీజెపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా హతుడు వామన్ రావు చనిపోయే ముందు మండల టీఆర్ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నేతల భూకబ్జాలకు వ్యతిరేకంగా న్యాయవాది వామన్ రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. ఈ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని బండి సంజయ్ హెచ్చరించారు. పూర్తి స్థాయి విచారణ పూర్తి అయిన తరువాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఘటనలపై సీఎం కేసిఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.