Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నువ్వానేనా అన్నరీతిలో జరిగింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీ అభ్యర్ధులను ముందుగానే కర్ణాటక తరలించేందుకు సిద్దమవుతున్నట్లు గా తెలుస్తొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపొందే పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఫలితాలకు ఇంకా రెండు రోజుల గడువు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరు ఇతర పార్టీల వైపు మళ్లకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలంగాణలో దాదాపు 65 నుండి 70 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటంతో అధికార బీఆర్ఎస్ ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ అభ్యర్ధులను క్యాంపునకు తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఒక వేళ మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటుగా స్థానాలు వచ్చినా అభ్యర్ధులు ఎవరూ ప్రత్యర్ధి పార్టీవైపు జంప్ చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వారిని క్యాంపులోనే ఉంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తొంది. ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో అభ్యర్ధులను కర్ణాటక క్యాంప్ కు తరలించి ఉంచాలని పార్టీ అధిష్టానం సూచనలను డీకే శివకుమార్ అమలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారనే సమస్య కూడా ఉంది.
దాదాపు అరడజను మందికిపైగా నేతలు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత సాంప్రదాయాలు చూసుకున్నట్లయితే పీసీసీ చీఫ్ లేదా సీఎల్పీ నేతను సీఎంగా ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 80 కిపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నామని అన్నారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్ధి ఎంపిక ఓ ప్రక్రియ ప్రకారం సాగుతుందని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీలో చర్చించి సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత సీఎం అభ్యర్ధిని ఎంపిక చేస్తారని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Exit Poll Result: తెలంగాణలో గెలిచేది ఆ పార్టీయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా