క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం చికోటి క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈడీ దాడులతో సతమతమవుతున్న క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. రూ.2.80 కోట్ల విలువైన కారుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రేంజ్ రోవర్ కారు విషయంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఆ కారు తన స్నేహితుడి సంస్థకు చెందినదనీ, అవసరం ఉన్నప్పుడు దానిని వాడుకుంటున్నట్లు అధికారులకు ప్రవీణ్ తెలిపినప్పటికీ.. అధికారులు మాత్రం దాన్ని ప్రవీణ్ బినామీ సంస్థ పేరుతో కొనుగోలు చేసినదిగా అనుమానిస్తున్నారు. ఆ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ.

భాటియా ఫర్నిచర్ పేరుతో చికోటి కారును కొనుగోలు చేశారు. ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డాడని ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఐటీ కూడా నోటీసులు పంపించడంతో ఈ విషయంలో అన్ని వైపుల నుండి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తొంది. క్యాసినో వ్యవహారంలో కొద్ది నెలల క్రితం ప్రవీణ్ కు సంబంధించి ఇళ్లల్లో, సంస్థల్లో ఈడీ సోదులు నిర్వహించడంతో పాటు ఆయనను తమ కార్యాలయానికి పిలిపించి ఈడీ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. విదేశీ క్యాసినో అక్రమాలపై జరిగిన హవాలా లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. తాజాగా ఐటీ శాఖ రేంజ్ రోవర్ కారు విషయంలో నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నోటీసులపై చికోటి ప్రవీణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.