KCR :గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్లో తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ అనుకున్నట్లే అంచనాలు మార్చింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.
జానారెడ్డి పై దూకుడు…
కాంగ్రెస్ జెండా సక్కగా ఉంటే…టీఆర్ఎస్ జెండా ఎగిరేదా ? అని కేసీఆర్ ప్రశ్నించారు. పదవుల కోసం కాంగ్రెస్ తెలంగాణను వదిలేసిందని నిప్పులు చెరిగారు. కేసీఆర్కు సిఎం పదవి జానారెడ్డి పెట్టిన బిక్షా..? అని ప్రచారం చేస్తున్నారని..తన సీఎం పదవి తెలంగాణ ప్రజల బిక్ష అని స్పష్టం చేశారు. జానారెడ్డికి సీఎం పదవి వస్తె అమ్ముకునే టోడని… నాకెందుకు ఇస్తారని చురకలు అంటించారు. తెలంగాణ కోసం పదవులు వదిలేసింది టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. జానారెడ్డి నేను ఇంత పొడుగు..అంతా పొడుగు అంటారని.. నందికొండ అటు గ్రామం కాదు… మున్సిపాలిటీ కాకుండా పోయిందని ఫైర్ అయ్యారు. కానీ తాము మున్సిపాలిటీ చేశామని..టీఆర్ఎస్ ను గెలిపిస్తే నందికొండ భూములకు పట్టాలు నేను వచ్చి ఇస్తానని సిఎం ప్రకటించారు. నందికొండలో డిగ్రీ కాలేజీ మంజూరు చేశామని..30 యేండ్లలో జానారెడ్డి.. ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకు రాలేదని ఫైర్ అయ్యారు.
రెడ్డి ఓట్లకు చెక్…
నాగార్జునసాగర్ ప్రజలకోసం ఏడాదిన్నరలో తిరుమలగిరి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. బిక్షం ఎత్తి అయినా తీర్చుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నోముల లేని లోటు ఉందని.. నోముల స్థాయిలో పని చేస్తారని భగత్ కి టికెట్ ఇచ్చనని పేర్కొన్నారు. పార్టీ నేత కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో నియోజకవర్గంలోని రెడ్డి ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడేలా కేసీఆర్ గేమ్ ప్లే చేశారని అంటున్నారు.