KCR: రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేసిఆర్ .. ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తమ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి.. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండటంతో తీరుబడిగా అటు మహారాష్ట్ర, మరో పక్క ఏపీలో అభ్యర్ధులను నిలపడం, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనవచ్చని భావించారు కేసిఆర్. ఏపీ విభాగానికి బీఆర్ఎస్ అధ్యక్షుడిని అయితే ప్రకటించారు గానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎక్కడా సభ నిర్వహించలేదు. అయితే మహారాష్ట్ర మీద కేసిఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాదాపు నాలుగైదు సార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించారు. ఆ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల్లోని సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్రలో బోణీ కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు కేసిఆర్.
నాందేడ్, ఔరంగాబాద్ లాంటి జిల్లాల్లో రెగ్యులర్ క్యాంపులు వేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అయిదు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను పోటీ దింపాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ, మండల కమిటీలు, నియోజకవర్గాల ఇన్ చార్జ్ ల నియామకాలు అన్నీ చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర విషయంలో అంత స్పీడ్ గా ఉన్న కేసిఆర్ .. ఏపీ విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్నారు. బీఆర్ఎస్ గా జాతీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఏపీలో ఒక్క సారి కూడా పర్యటన చేయలేదు.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలనీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో మహారాష్ట్రలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు కేసిఆర్. కేసిఆర్ ఇలా ప్లాన్ లు చేసుకుని ఉండగా, మోడీ.. జమిలి ఎన్నికలు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) అంటూ ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం కేసిఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. జమిలి వస్తే ఇతర రాష్ట్రాల్లో అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల ప్రచారం కేసిఆర్ కు కష్టతరం అవుతుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా ఎన్నికల్లో దృష్టి సారించడం ఇబ్బందికరమే. జమిలి వస్తే గనుక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసిఆర్ కోరిక నెరవేరే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
AP Elections: న్యూస్ ఆర్బిట్ స్పెషల్ ఎనాలసిస్ : ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీ cm ఎవరు ?