Telangana Congress: దేశంలో క్రమశిక్షణ లేని పార్టీ జాతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. జాతీయ పార్టీలైన బీజేపీ, వామపక్ష పార్టీల్లో ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం ఉండదు. పార్టీ స్టాండ్ కు అనుగుణంగానే నేతలు మాట్లాడుతుంటారు. పార్టీని బజారుకు ఈడ్చే విధంగా నేతలు వ్యవహరించడం జరగదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వాక్ స్వాతంత్రం ఎక్కువ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయితే కమశిక్షణా రాహిత్యం మరీ ఎక్కువ. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమ్మతి, అసమ్మతి నేతలు ఉండనే ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది కానీ వారిలో ఉన్న విబేధాలను తొలగించేందుకు తీసుకున్న చర్యలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనుకున్న అనేక మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కొందరు బీజేపీలో చేరిపోయారు.
Read More: YS Viveka Case: వివేకా హత్య కేసు ..చంద్రబాబు వర్సెస్ సజ్జల
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కానీ..
కొందరు సీనియర్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ క్యాడర్ ఎక్కువ శాతం టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం తీసుకురావాలంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన పార్టీ హైకమాండ్ టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. ఇది కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చింది. దాదాపు ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీలో వెళ్లడమే ఉండగా, రేవంత్ రెడ్డి తన దైన శైలిలో రాజకీయాలు చేయడంతో పార్టీలో చేరికలు ఆరంభం అయ్యాయి. అయితే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కొందరు సీనియర్ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుండి సీనియర్ నేతలు వి హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి తదితర నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు.
‘ఇద్దరు రెడ్లు కలిశారు.. వాళ్లంతా చుట్టాలే’
అయితే పార్టీ హైకమాండ్ ఆదేశాలతో కొంత వరకు సర్దుకుపోతూ వచ్చారు. మధ్య మధ్య రేవంత్ చర్యలను విమరిస్తూ వస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలో జరిగిన ఓ పరిణామంపై సీనియర్ నేత వి హనుమంతరావు అభినందించాల్సిందిపోయి విమర్శించారు. తొలి నుండి ఎడమొహం పెడ మొహంగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. పార్టీ ఉన్నతి కోసం కలిసి పని చేస్తామని ఇద్దరు పేర్కొన్నారు. ఒక పార్టీలో విబేధాలతో ఉన్న నాయకులు కలిసి పని చేయడాన్ని అదే పార్టీలోని వారు స్వాగతించాలి కానీ వి హనుమంతరావు దీనిపై పార్టీ నేతల పరువు తీసే విధంగా కామెంట్స్ చేశారు. ఇద్దరు రెడ్లు కలిశారు, వారు ఇద్దరు కలవడంలో పెద్ద గొప్పేమీ కాదు అని వి హనుమంతరావు అన్నారు. వాళ్లంతా చుట్టాలేనని విహెచ్ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కేసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వడాన్ని విహెచ్ తప్పు బట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు నాడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టడం సరికాదని విహెచ్ అన్నారు. పుట్టిన రోజు నాడు శాపనార్ధాలు పెట్టడం సరికాదనీ, ఆడవాళ్లే శాపనార్ధాలు పెడతారంటూ పరోక్షంగా రేవంత్ పై విహెచ్ వ్యాఖ్యలు చేశారు.