Chandrababu: రాష్ట్రంలో సంచలన వార్తలకు కొదవ లేకుండా పోతుంది. రోజు ఏదో ఒక సెన్సేషనల్ వార్త తెరపైకి వస్తూనే ఉంది. కొత్త వార్త వెలుగులోకి రావడంతో పాత వార్త తెరమరుగు అవుతోంది. గత రెండు మూడు రోజులుగా మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తునకు సంబంధించిన వార్త రాష్ట్రంలో హైలెట్ గా ఉంది. ఆ కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీటు వెలుగులోకి రావడం, కొద్ది రోజుల విరామం తరువాత మళ్లీ దర్యాప్తును సీబీఐ వేగవంతం చేయడంతో ఇక కీలక అరెస్టులు ఉంటాయని దానిపైనే మీడియా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీ తో దానిపై మీడియా డిబేట్లు నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఆయనకు ఏపీపిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో దానిపైనా చర్చ జరుగుతోంది.
Read More: TDP: టీడీపీ కీలక సమావేశానికి చంద్రబాబు ఆహ్వానించినా మాజీ మంత్రి గంటా గైర్హాజరు..! రీజన్ ఏమిటంటే..??
Chandrababu: చంద్రబాబు భూమి కబ్జా అంటూ..
ఈ తరుణంలో శుక్రవారం అనూహ్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన భూమి కబ్జా అంటూ సెన్సేషనల్ వార్త మీడియాకు వచ్చింది. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన సొంత భూమినే కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించారనీ, మాజీ ముఖ్యమంత్రికి చెందిన స్థలానికే రక్షణ లేకపోతే సామాన్యుల ఆస్తుల పరిస్థితి ఏమిటి అంటూ ఓ సెక్షన్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ స్పందించలేదు. ప్రతి అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించే నారా లోకేష్ కూడా భూకబ్జా కథనాలపై కామెంట్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు నారావారి పల్లెలో ఏమి జరిగింది..? నిజంగానే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారా..? టీడీపీ నాయకులు ఏమంటున్నారు..? కబ్జా చేయడానికి ఫెన్సింగ్ వేసిన వాళ్లు ఏమంటున్నారు..? అనే విషయాలు పరిశీలిస్తే…
Chandrababu: ఆ భూమి రామ్మూర్తి నాయుడుది
చంద్రబాబు నాయుడు ఆస్తికే రక్షణ లేకుండా పోయిందనీ, సామాన్యుల పరిస్థితి ఏమిటని టీడీపీ నేతలు అంటున్నారు. వాస్తవానికి 1989లో చంద్రబాబు నాయుడు తండ్రి నారా కర్జూరనాయుడు 87 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో కొంత చంద్రబాబు నాయుడుకు, కొంత ఆయన రెండవ కుమారుడు రామ్మూర్తినాయుడికి వాటా కింద వచ్చింది. చంద్రబాబుకు వాటాగా వచ్చిన భూమిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కళ్యాణ మండపం తదితర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేశారు. అయితే అక్కడ 38 సెంట్ల భూమి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉంది. ఈ స్థలంలో కొందరు కబ్జా చేసేందుకు రాళ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటంతో అక్కడి టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ స్థలం తమదేనని కబ్జా చేయడానికి ప్రయత్నించిన మహిళ టీడీపీ నేతలతో వాదనకు దిగింది. భూకబ్జా విషయంపై రామ్మూర్తి నాయుడు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని టీడీపీ నేతలు అంటున్నారు.
Chandrababu: ఆన్ లైన్ లో మాత్రం మరోకరి పేరు
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే స్థలం రిజిస్టేషన్ పత్రాలు రామ్మూర్తి నాయుడు పేరు మీద ఉండగా, ఆన్ లైన్ మాత్రం మరోక పేరు చూపిస్తోంది. నారా సిద్దమ్మ పేరు ఆన్ లైన్ లో ఉంది. అనువంశిక ఆస్తిగా ఆన్ లైన్ లో చూపిస్తోంది. వాస్తవానికి ఈ భూమి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినదేననీ, అయితే ఆన్ లైన్ లో తప్పుగా నమోదు చేయడం వల్లే దాన్ని ఆసరాగా తీసుకుని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, వీరికి వైసీపీ నేతలు సపోర్టు చేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. అక్కడ ఫెన్సింగ్ వేయిస్తున్న మహిళ మాత్రం ఇది అంతా ఉమ్మడి ఆస్తి అని చంద్రబాబుకు వచ్చిన వాటాను కళ్యాణ మండపం తదితర వాటికి విరాళంగా ఇచ్చారనీ, ఈ భూమి తమదేనని పేర్కొంది. చంద్రబాబుతో గొడవ పెట్టుకునే పెద్ద వాళ్లం తాము కాదనీ, ఒక వేళ భూమి వాళ్లదే అని చెబితే వదిలివేస్తామని ఇది తమ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం అని పేర్కొంది. ఈ వ్యవహారంపై చంద్రబాబు, నారా లోకేష్ అయితే స్పందించలేదు కానీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ స్పందించింది. వైఎస్ వివేకా హత్య దర్యాప్తు నుండి దృష్టి మళ్లించేందుకు వైసీపీ వేసిన స్కెచ్ ఇది విమర్శించింది టీడీపీ.