TDP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ కీలక నేత. 2019 ఎన్నికల ఫలితాల తరువాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొంత కాలం పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 30 నెలల కాలంలో టీడీపీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నా గంటా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేసినప్పుడూ గంటా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ నేపథ్యంలో గంటా ఉద్దేశపూర్వకంగానే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని చంద్రబాబు భావించారు. మూడు రాజధానుల విషయంలో పార్టీ స్టాండ్ కు భిన్నంగా గంటా స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. వైసీపీలో చేరబోతున్నారు అంటూ ఊహగానాలు వచ్చాయి.
TDP: గంటాకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు
అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు కాపు సామాజికవర్గ నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు గంటా. కాపు సామాిజకవర్గ నేతలతో పాటు మేధావులు, పదవీ విరమణ అయిన అధికారులతో భేటీలు జరుపుతూ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావు ను యాక్టివ్ చేయాలనీ, పార్టీ బలోపేతానికి గంటా సూచనలు సలహాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో నేడు జరిగే కీలక సమావేశానికి హజరు కావాలని గంటాకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు అందింది.
నేడు విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా గంటా సహా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తదితరులకు పార్టీ కబురు పంపింది. అయితే ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు రావడం లేదని సమాచారం. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో తాను త్వరలో వచ్చి కలుస్తానని పార్టీ కార్యాలయానికి గంటా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ కీలక సమావేశానికి గంటా గైర్హజరు అవుతుండటంపై ఆయన చెబుతున్న రీజన్ కరెక్టేనా..? కాదా ఇంకా ఏదైనా కారణం ఉందా అని పార్టీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.