Bhatti Vikramarka: బీఆర్ఎస్ సర్కార్ ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచిందని, విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని తెలంగాణ డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని విక్రమార్క చెప్పారు. విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిందని అన్నారు.
అందుకే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశామని భట్టి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉందని తెలిపారు. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
కేవలం రాజధాని హైదరాబాద్లోనే ఉండకుండా.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. వీలైనంత మేరకు వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి తెలిపారు.
RGV: కొలికపూడి తలెక్కడ దాచుకున్నాడని ప్రశ్నించిన ఆర్జీవీ