Vijayasanthi: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షం సీపీఐ ఒక స్థానం గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభం మొదలైనప్పటి నుండి ఈ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మరో పక్క బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ జరిగి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ తర్వాత కాంగ్రెస్ కూలిపోతుందన్న వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
‘బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి సర్జరీ జరిగి హాస్పిటల్ల ఉంటే, మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే.. అందుకు కూడా కొంత మంది బీఆరెస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చెయ్యడం అసమంజసం. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆరెస్కు అవసరమేమో కానీ, కాంగ్రెస్కు ప్రభుత్వానికి కాదు. అట్లాంటి ప్రకటనలు చేస్తున్న బీఆరెస్ నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ గారికి ఉంది’ అని పేర్కొన్నారు.
‘అంతేకాదు, మీ కొందరు బీఆరెస్ నేతలు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా ఉండదు.. అని చేస్తున్న ప్రకటనలను కూడా మీరు తప్పక తప్పు అని చెప్పాలి కేసీఆర్ గారూ.. (మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే.. అన్న ధోరణి విడిచి, తెలంగాణల ప్రజాస్వామ్యం తప్పక పదికాలాలు మంచిగుండాలి.. అని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే..)’ అని రాసుకొచ్చారు విజయశాంతి. మనవీయ కోణానికి రాజకీయంతో ముడిపెట్టడం సరికాదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Central Team: ఏపీకి కేంద్ర బృందం .. తుఫాను నష్టం అంచనాకే నేడు, రేపు పర్యటన