ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య ఆగినట్లే ఆగిన ట్వీట్ ల వార్ మళ్ళీ ప్రారంభం అయ్యింది. వారి విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యవహరిస్తున్న తీరు గోడ మీద పిల్లిగా ఉంటుందని, ఎప్పుడు ఒకటే స్టాండ్ పై కాకుండా పరిస్థితులకు అనుకూలంగా వారి మాటలు ఉంటాయని పరిశీలకులు అంటుంటారు. అందుకు ఉదాహరణలు ఏమిటంటే..బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల అంశంలో గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గానీ, జగన్ ప్రభుత్వ పరిపాలన తీరులో గానీ, చంద్రబాబును సమర్ధిస్తూ, వ్యతిరేస్తూ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు, ట్వీట్ లు గోడమీద పిల్లి (గోపి) తత్వాన్ని బయట పెడుతుంది అని అంటుంటారు. అదే మాదిరిగా విజయసాయి రెడ్డి కేంద్రంలోని బిజెపితో ఒకలా, రాష్ట్రంలోని బీజేపీతో మరోలా వ్యవహరిస్తున్న తీరును ఉదాహరణగా చూవుతున్నారు.
ఏపిలోని బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, దగ్గుబాటి పురంధరేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తూనే మరో పక్క కేంద్ర బీజేపీ నాయకులతో లాబీయింగ్ లు కొనసాగిస్తూ మా మధ్య ఏమి లేవంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కన్నాపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.
‘కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా? బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా?’ అంటూ విజయసాయి సెటైర్ వేశారు.
దీనికి కన్నా స్పందిస్తూ.. ‘ఎంపరర్ అఫ్ కరప్షన్ లో మీరు ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల అవినీతిపై మీరు అధికారం చేపట్టాక తీసుకున్న చర్యలేంటి?’ అని విజయసాయిని ప్రశ్నించారు. అయితే వీరి ట్వీట్ లపై సోషల్ మీడియాలో బాగానే రచ్చ జరుగుతోంది. వీరి పోరును ఎవరు తీరుస్తారో మరి.