(ఆమరావతి నుండి “న్యూస్ అర్బిట్” బ్యూరో)
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారు? ఎమి మాట్లాడారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమి మాట్లాడుతున్నారు? అనేది సగటు మనిషికి కూడా అర్థం అవుతుంది. కులాలకు, మతాలకు అతీతంగా రాజకీయాలు చేసి పాతిక కిలోల బియ్యం కోసం కాదు – పాతికేళ్ల భవిష్యత్తు కోసం జనసేన కృషి చేస్తుంది మా విధానాలు, మా సిద్ధాంతాలు వేరు అంటూ రాజకీయం మొదలు పెట్టిన జనసేనాని ప్రస్తుతం ఒక మతం రంగు పూసుకుని పరోక్షంగా కుల నాయకుడిగా మారిపోయి కాషాయం అడుగు జాడల్లో నడుస్తున్నారు. నిజానికి బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న తరువాత ఏపిలో జనసేన బలం బిజెపి కంటే ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో బిజెపి నడుస్తుంది అందరు అనుకున్నారు. కానీ కేంద్రంలో బిజెపి బలం, రాష్ట్రంలో బిజెపి అవసరాలు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బిజెపి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు. అడుగులో అడుగు వేస్తే ఫరవాలేదు. కానీ మాటతో మాట కలిపితే మతంతో మత వాదన కలిపితేనే జనసేనాని రాజకీయ సిద్ధాంతాలకు దెబ్బపడుతుంది. ఇదిగో అంతర్వేది ఘటన విషయంలో ఆయన స్పందన, ఆయన చేసిన ఆందోళన, ఆయన మాట, ఆయన తీరు మొత్తం కాషాయ పవన్ కళ్యాణ్ ను ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి.
ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు.. వీరు వారు అవుతారు అన్న సామెత మాదిరిగా బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాన్ మొత్తం హింధూత్వ ఏజండా పునికి పుచ్చుకున్నట్లు కనబడుతుంది అంటున్నారు పరిశీలకులు. అంతర్వేది ఘటనలో బిజెపి నాయకులు, హింధూ సంఘాల నేతలు ధర్మపరిరక్షణ దీక్షలు చేశారు. ఇలాంటి అంశాలలో బిజెపి స్పందించడం కొత్తమీ కాదు. దేశ రాజకీయాల్లోనే రామమందిర వివాదంతో బిజెపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతర్వేది లాంటి వివాదాల సాకుతో ఏపిలో బిజెపి ఆందోళనలు నిర్వహించి రాజకీయంగా బలపడాలని భావించవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమింటే బిజెపి నాయకుల మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ధర్మపరిరక్షణ దీక్ష చేయడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ సామాజిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు తప్పించి మత పరమైన అంశాల విషయంలో స్పందించి ఆందోళనలు నిర్వహించిన దాఖలలు లేవు. తిరుమలలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని వివాదం వచ్చినప్పుడు గానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలు కూల్చినప్పుడు గానీ ఇతర సందర్భాలలో గానీ పవన్ కళ్యాణ్ నేటి మాదిరిగా స్పందించలేదు. అందుకే పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ దీక్ష చేయడం విశేషంగా పేర్కొనవలసి వస్తున్నది.
బిజెపితో జత కట్టక ముందు పవన్ కళ్యాణ్ హింధూ ధర్మపరిరక్షణ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వాటిపైనా మాట్లాడలేదు. ఇప్పుడు బిజెపితో జత కట్టిన తరువాత పూర్తి హిందూత్వ వాదిగా మారిపోయి పవన్ స్పందించడం చూస్తుంటే రాజకీయ పరిశీలకులు పవన్ కాషాయ ఎజెండా స్వీకరిస్తున్నట్లు ఉంది అంటున్నారు. అమరావతి రైతుల పరిక్షణ కోసం బిజెపితో కలసి ర్యాలీ చేస్తామనీ గతంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాాణ్ అమరావతి విషయంలో బిజెపి స్టాండ్ మారిపోవడంతో ర్యాలీ ప్రతిపాదన విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా మారిపోవడానికి సహవాస దోషమే కారణమనే మాట వినిపిస్తోంది.