దేశ వ్యాపితంగా కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలు విధిగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మొదటి నుండి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాస్కు ధరించకుంటే జరిమానా కూడా విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే ఏపి ప్రభుత్వం తాజాగా దీనిపై సెర్క్కులర్ కూడా జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లోనూ ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే రాష్ట్రంలో చాలా వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కు లు ధరించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటీవల 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రమే మాస్కు ధరించారు. ఆ తరువాత నేటి వరకు జరిగిన కార్యక్రమాల్లో కానీ సమిక్షల సందర్భాల్లో గానీ సీఎం జగన్ దాదాపుగా మాస్క్ ధరించినట్లు కనబడలేదు.
సీఎం జగన్ మాస్క్ ధరించక పోవడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పు పట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ‘వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా? ప్రజలంతా ఖచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేకపోతే చర్యలు తప్పవు అంటూ జిఓ తెచ్చిన వారు ఆ నిబంధన పాటించరా? యుశ్రారైకాపా నాయకులు కరోనా కి అతీతులా?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
‘సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా? మాస్కు పెట్టుకోకుండా స్వైర విహారం చేస్తున్న జగన్ రెడ్డి గారు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?’ అని లోకేష్ నిలదీశారు. అయితే నిత్యం ట్విట్టర్ వేదికగానే విమర్శలకు స్పందిస్తూ..ప్రతి విమర్శలు చేసే వైకాపా నాయకులు లోకేష్ ట్వీట్ కు స్పందించక పోవడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. సీఆర్డీఏ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై యనమల రామకృష్ణుడు గవర్నర్ కు సూచనలు చేయడాన్ని తప్పు పడుతూ..ట్విట్టర్ వేదికగా యనమలను విమర్శించారు కానీ లోకేష్ ట్విట్ కు స్పందించలేదు. దీనిపై సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారో.. మాస్క్ ధరిస్తారో లేదో వేచి చూడాలి.