తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు అధికం అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడి చేయలేక చేతులు ఎత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. కరోనా తొలి నాళ్లలో వారానికి ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో విఫలం అయ్యింది అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకుడు రామ్ మాధవ్ తదితరులు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, మరో పక్క ప్రజలు కూడా కరోనా సమస్యపై గవర్నర్ తమిళి సై ట్విట్టర్ వేదికగా పిర్యాదులు చేయడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగారు. ఓ పక్క ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగా గవర్నర్ తమిళి సై నేరుగా రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహించడం ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ చర్యలపై కేసీఆర్ సర్కార్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ గవర్నర్ తమిళిసై తన శైలిలో ముందుకు వెళుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన కుముద్బెన్ జోషి, తమిళనాడు లో జయలలిత హయాంలో గవర్నర్ గా పని చేసిన మర్రి చెన్నారెడ్డిల పని తీరు మాదిరిగానే నేడు తెలంగాణలో గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వారు ఇద్దరు నిర్వహించిన మాదిరిగా తమిళిసై కూడా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
కెసిఆర్ ముఖ్య మంత్రి అయినప్పటి నుండి సుదీర్ఘ కాలం గవర్నర్ గా పని చేసిన నర్సింహన్ తో సన్నిహిత సంబంధాలే కొనసాగగా ప్రస్తుత గవర్నర్ తమిళిసై తో పొసగడం లేదంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు ఆసక్తికరంగా, చర్చినీయాంశంగా మారుతున్నాయి.