ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అలాగే, లక్షల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ మహమ్మారిపై శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో కోవిడ్-19 సంబంధించిన కొత్త కొత్త, ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
కరోనా మమ్మారి కారణంగా శ్వాస వ్యవస్థ తీవ్ర స్థాయిలో దెబ్బతిటోంది. దీని కారణంగానే ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసింది. అయితే, శ్యాస వ్యవస్థ పైనే కాకుండా డైరెక్టుగానే గుండె పై కరోనా వైరస్ ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. గుండెతో పాటు శరీరంలోని మరిన్ని అవయవాలపై కోవిడ్-19 ప్రత్యక్షంగానే దాడికి దిగుతున్నదని తెలిపారు.
చికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అందులోని వివరాల ప్రకారం.. ఊపిరితిత్తులపై కరోనా ఎటాక్ చేయడంతో దాని ప్రభావం గుండె పై పడుతోందని ఇది వరకూ నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ కోవిడ్ -19 గుండె కండరాలపై డైరెక్టుగానే దాడిని మొదలు పెడుతోంది. దీనికి సంబంధించిన అధారాలను కూడా ఈ అధ్యయనం సేకరించింది.
దీని కారణంగా కరోనా రోగుల్లో దాదాపు 25 నుంచి 30 శాతం మందిలో గుండె సంబంధ అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. దీంతో గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే, రక్త నాళాలపై వైరస్ దాడి చేస్తోందనీ, దీని కారణంగా శరీరంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం పొంచివున్నదని పరిశోధకులు తెలిపారు. ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేనివారిలోనూ కరోనా సోకిన అనంతరం వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యలు ఎంతకాలం ఉంటాయనే దానిపై ఇంకా పరిశోధనలు సాగిస్తున్నామని శాస్త్రవేత్త సీన్ పిన్నేయ్ తెలిపారు.