మారుతున్న కాలంతో పాటే పెద్దపెద్ద కంపెనీలు సైతం ఉత్పత్తుల ప్రమోషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొత్తగా తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎంత కొత్తగా పబ్లిసిటీ చేస్తే అంత ఎక్కువగా వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. తాజగా బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ సరికొత్త జాబ్ ఆఫర్ ను పోస్ట్ చేసి బ్రహ్మాండమైన పబ్లిసిటీ పొందుతోంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రపంచ దేశాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఒక కంపెనీ టీవీ చూస్తూ ఇంట్లో కూర్చుని రోజుకు 25 వేల రూపాయలు సంపాదించే అవకాశం కల్పించింది. ‘చిల్ అవుట్ రివ్యూవర్’ పేరుతో బ్రిటన్ కు చెందిన పౌర్ మోయి కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులైన పైజామాలను ధరించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డబ్బు సొంతం చేసుకోవాలని తెలిపింది.
బ్రిటన్ కంపెనీ అయినప్పటికీ ఆ దేశం వాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచం నలువైపులా ఈ ఉద్యోగం కోసం కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 18 సంవత్సరాల వయస్సు పై బడిన వారు అక్టోబర్ 12వ తేదీ లోపు ఈ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 26న లక్కీ డ్రా ద్వారా ఎంపికైనా ఉద్యోగి పౌర్ మోయి సంస్థకు చెందిన దుస్తులను ధరించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ ఉద్యోగం చేయాలంటే కొన్ని షరతులను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఉత్పత్తులను ధరించిన సమయంలో బెడ్ లేదా సోఫాపై కూర్చుని ఇష్టమైన ఎపిసోడ్స్ ను చూడటంతో పాటు చాక్లెట్ లేదా వైన్ ను ఆస్వాదిస్తూ సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఉత్పత్తులకు సంబంధించి ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది.