Gyanwapi Case Supreme Court: జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి కోర్టుకు సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ముస్లింల తరపు న్యాయవాది హంజేఫా అహ్మది వాదనలు వినిపించారు. దేశ వ్యాప్తంగా అనేక వ్యాజ్యాలు పెండింగ్ లో ఉన్నాయనీ, వాటిపై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందనీ, అది ఈ రోజే జరగాలని ఆయన అన్నారు. ట్రయల్ కోర్టు ముందు విచారణలు నేటికి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కాగా హిందూ విశ్వాసుల తరుపున వాదనలు వినిపించే సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో కోర్టుకు రాలేదనీ, విచారణను రేపటికి వాయిదా వేయాలని ఆయన తరుపు విష్ణు శంకర్ జైన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు విచారణను రేపు జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇదే సందర్భంలో ఈ వ్యాజ్ఞాన్ని సుప్రీం కోర్టు విచారించే వరకూ వారణాసి దిగువ కోర్టు విచారణను నిలుపుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Read More: Supreme Court: రాజీవ్ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు .. ఓ దోషికి బిగ్ రిలీఫ్
Gyanwapi Case Supreme Court: వారణాసి కోర్టుకు సర్వే నివేదిక
మరో పక్క వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ తమ రిపోర్టును అందించింది. సర్వేకి సంబంధించిన వీడియోని సీల్డ్ కవర్ లో ఉంచి కోర్టుకు సమర్పించింది. కాగా ఈ సర్వే లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు గా కమిటీ నిర్ధారించిందనీ, విగ్రహాల ముక్కలు ఉన్నాయనీ, మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయనీ, హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయనీ కమిటీ గుర్తించినట్లు బయటకు వార్తలు వచ్చాయి. దీంతో మసీదు మొత్తాన్ని పురావస్తుశాఖ సర్వే చేయాలన్న డిమాండ్ వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారణాసి కోర్టులో ఈ వాజ్ఞంపై విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే శివలింగం కనిపించిన ప్రదేశంలో తక్షణం పూజలకు అనుమతించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.