తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కదలిక వచ్చింది. 2017లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసినా అది సుప్రీం కోర్టులో లిస్టింగ్ కాలేదు. దీంతో ఆయన మరో సారి ఎర్లీ హియరింగ్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసు చార్జి షీటులో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారని, అయినా చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని వివరించారు. ప్రస్తుతం ట్రయిల్ కోర్టులో కేవలం ఏ 1 నుండి ఏ 5 వరకు మాత్రమే విచారణ జరుపుతున్నారని చంద్రబాబు మీద విచారణ జరగడం లేదని సుప్రీం ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాది తీసుకువచ్చారు. ఈ పిటిషన్ను జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్తో టీడీపీ బేరం చేసింది. ఈ వ్యవహారంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. స్టీఫెన్ సన్ తో మొత్తం అయిదు కోట్ల రూపాయలకు డీల్ షటిల్ చేసుకుని రూ.50లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన వీడియో సాక్షం నాడు సంచలనం సృష్టించింది. ఈ డీల్ సందర్భంలో స్టీఫెన్ సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు రావడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో తన ఫోన్ టాప్ చేశారంటూ కేసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాగా ఈ కేసులో నిందితుడైన ఉదయసింహాను పోలీసులు నిన్న మరో సారి అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ పై ఉన్న ఉదయసింహా కోర్టు వాయిదాలకు హజరుకాకపోవడంతో ఏసిబి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బిడబ్ల్యు) జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.