“మర్రి”కి సీటు ఉత్తుత్తి ప్రచారమేనా..!
ఆ రెండు స్థానాల్లో ఒకరికే అవకాశం..కాపు నేతకు ఛాన్స్..!
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
కంతేటి సత్యనారాయణ రాజు, రత్నాబాయి పదవీ కాలం ముగియటంతో ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని..వైసీపీలో చేరిన తరువాత తిరిగి డొక్కతోనే ఆ స్థానం భర్తీ చేసారు. ఇక.. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్…మోపిదేవి వెంకరమణ లను రాజ్యసభకు పంపటం ద్వారా ఖాళీ అయిన రెండు స్థానాల పైన వైసీపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. అయితే, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉన్నా..అందులో ఒక స్థానం భర్తీ మాత్రం సాధ్యపడదు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక, మంత్రి వర్గ విస్తరణ పైనా చర్చ జరుగుతున్న సమయంలో అటు మంత్రి పదవులు..ఇటు ఎమ్మెల్సీలుగా ప్రయత్నిస్తున్న ఆశావాహులు జరుగుతున్నపరిణామాలను ఆసక్తిగా చూస్తున్నారు.
గవర్నర్ కోటా ఆ వర్గాలకే..మర్రికి లేనట్లేనా..!
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల పైన ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ నెల 15న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ రెండు పేర్లను అధికారికం గా ఆమోదించి గవర్నర్ కు నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సీట్లను ఎస్సీ..ముస్లిం వర్గాలకు ఇవ్వాలని జగన్ నిర్ణయించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో ఒకటి కడప జిల్లా లేదా వియవాడ తూర్పు నియోజవకర్గానికి చెందిన మైనార్టీ నేతకు ఇవ్వనున్నారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ తూర్పు నుండి మైనార్టీ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. రెండో స్థానం ఎస్సీ వర్గానికి ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేత మోషెన్ రాజు పేరు ఇందు కోసం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నుండి అమలాపురం ఎంపీగా పని చేసి..ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, మోషెన్ రాజు వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఇక..2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకి సీటు ఖరారు చేసే సమయంలో..అక్కడ పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు గవర్నర్ కోటాలో మర్రికి సీటు ఖాయమైందనే ప్రచారం సాగుతోంది. కానీ, వైసీపీ ముఖ్యనేతలు మాత్రం రాజశేఖర్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని..గవర్నర్ కోటాలోని రెండు సీట్లు ఎస్సీ..మైనార్టీ వర్గాలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేస్తున్నారు.
ఆ రెండు స్థానాల్లో ఒకటే ఛాన్స్…!
మంత్రులుగా ఉంటూ రాజ్యసభకు ఎంపికైన పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణ ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు. దీంతో..గవర్నర్ కోటా అభ్యర్ధులతో పాటుగానే రెండేళ్ల కాలం సమయం ఉన్న ఈ స్థానానికి సైతం అభ్యర్ధిని ఎంపిక చేసే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా నుండి తాజాగా డొక్కాకు ఇవ్వటంతో అదే జిల్లాకు చెందిన రాజశేఖర్ ను ఈ సీటుకు ఎంపిక చేస్తారా..లేక కాపు కోటా కింద ఖరారు చేస్తారా అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాపు కోటాలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చీరాల నియోజకవర్గం నుండి పోతుల సునీత..కరణం బలరాం వంటి వారిని వైసీపీ దగ్గరకు తీసుకుంది. అయినా.. ఆమంచి పార్టీకి పూర్తిగా సహకరిస్తుండటంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేరు పరిశీలనలో ఉంది.
ఆమంచి..త్రిమూర్తులు ఇద్దరూ సన్నిహితులు కావటంతో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా గెలవటంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాకపోవటంతో..ఆ జిల్లా నుండి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉంది. ఆ కోటా కింద స్థానిక సంస్థలు పూర్తయిన తరువాత ఆమంచికి అక్కడి నుండి అవకాశం కల్పిస్తారనే ప్రచారమూ ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండు స్థానాలు బీసీలకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించటం..గవర్నర్ కోటాలో రెండు సీట్లను ఎస్సీ..మైనార్టీలకు ఇవ్వాలని డిసైడ్ అవ్వటంతో..మిగిలిన ఈ ఒక్క స్థానం కాపు వర్గానికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.