ఏదైనా ఒక స్టోరీకి ముగింపు ఉంటేనే అందులో థ్రిల్ ఉంటుంది. మజా ఉంటుంది. లేదంటే ఆ సాగదీతకు అర్థం ఉండదు. పరమార్థం అంతకంటే ఉండదు. ఏపీ రాజకీయాల్లో గాలి పోగేసి గేమ్ ప్లే చేయాలని చూస్తున్న ఆ పార్టీకి భవిష్యత్లో 70 MM సినిమా చూపించేందుకు రంగం సిద్ధమైపోయిందట. కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లి చూడటం ఉండదు కదా… అందుకే ఇళ్లలోనే వర్చ్యువల్ రియాల్టీలో సినిమా చూపించే స్కెచ్ ఇంప్లిమెంట్ అవుతోందట. అవును మీరు వింటున్నది నిజమే… ఆ సినిమాకు పేరు, డైలాగులు, పాత్రలు ఏమీ ఉండవు. జస్ట్ స్ట్రీన్ ప్లే, డైరక్షన్ మాత్రమే ఉంటుంది. ఆ సినిమా ఏంటంటే… తెలుగు తమ్ముళ్లు పూర్తి స్థాయిలో బీజేపీలో విలీనం కావడమే… పక్కా కార్పొరేట్ సంస్థకు దీటుగా ఉండే తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టడం, ఏమైనా చేయడం అంత వీజీ అయ్యే పని కాదు… కానీ అందుకు స్కెచ్ వేసి ఇంప్లిమెంట్ చేస్తే తప్పించి…
ఆ ఆలోచన అటు వైసీపీ-ఇటు బీజేపీ అగ్రనాయకత్వానికి వచ్చిందట. అది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో ఏమో గానీ… గతంలోనూ ఇలాంటి ప్రతిపాదన ఒకటి వచ్చిందట. అయితే అది వర్కౌట్ కాలేదు. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బ్రహ్మానందాలు తెలుగు నేలపై గల్లీకొకరున్నారు. అవును ఎందుకంటే అందులో తిక్క లేదు. లాజిక్కు మాత్రమే ఉంది. టీడీపీలో ఉన్న పెద్దల సభ సభ్యులంతా కషాయం తాగి, పువ్వు పార్టీ జెండాలతో దర్శనమిస్తే తెలుగు జనమంతా ఇదేం విడ్డూరమో అనుకున్నారు గానీ… ఎవరూ పెద్దగా ఆ అంశాన్ని చర్చించుకోలేదు. ఎందుకంటే ఒక మీడియాకు అది పెద్ద విషయం కాదు. అది అసలు తప్పే కాదు. ఎందుకంటే దాని వెనుక కర్త, కర్మ, క్రియ 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి. అందుకోసం మీడియా, కార్పొరేట్ లాబీయింగ్ కూడా ఒక రేంజ్లో ప్లాన్ చేసింది. అందుకే పువ్వు పార్టీ వాళ్లు కూడా జరిగేదేదో చూద్దాం… కానివ్వండి అనుకున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు, లాంఛనంగా బీజేపీలో విలీనమవగా… ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు మాత్రమే మిగిలారు.
ఇక రెండో స్పాట్ చూద్దాం. టీడీపీకి లోక్సభలో ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురిది మూడు రకాల విలక్షణత. ఒకరు టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉననట్టున్నప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా అధినేత చేసే కార్యక్రమాల్లో లోటుపాట్లను వేలెత్తి చూపిస్తుంటారు. ఆయనకు ఢిల్లీలో కొందరు బీజేపీ పెద్దలతో పరిచయాలు కూడా ఉన్నాయ్. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీని వీడి కమలం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా చెబుతున్నారు. లోకేశ్ యాక్షన్కు బీజేపీలోకి వెళ్లడమే తన రియాక్షన్ అంటూ పార్టీ గల్లా పట్టుకొని మరీ జయదేవ్ రంగం సిద్ధం చేసుకున్నారట. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు… సందర్భం చూసి కాషాయం తీర్థం పుచ్చుకునే అవకాశముందంటున్నారు. మొత్తంగా ముగ్గురు ఎంపీలు బీజేపీలో విలీనమవుతానంటే అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.. టీడీపీ ఎంపీలు రాజ్యసభలో చేరినప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే సైలెంట్ అయిపోతారా… ? లేక ప్రజాస్వామ్యం… విలువలు అంటారా?
ముల్లును ముల్లుతోనే తీసే ఓ రేంజ్ గేమ్ స్క్రీన్ ప్లే పనులు చకచకా సాగిపోతున్నాయ్ మొన్న రాజ్యసభ… రేపోమాపో లోక్సభ… ఆ తర్వాత ఇక మిగిలింది శాసనసభే… అవును ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలు… టీడీపీకి సరెండర్ అయిపోయారన్న వార్తల నడము ఆ ఎపిసోడ్కి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొత్త సారధి రంగంలోకి దిగాక… ఫిరాయింపులకు వేళ అయినట్టుగా భావించాల్సి వస్తోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం, వైసీపీ సర్కారుకు బాసటగా నిలుస్తోంది. టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలన్నది ఇద్దరి ఎజెండా. అది నేను చేస్తే ఏంటి? నువ్వు చేస్తే ఏంటి? ప్లాన్ అమలు కావాలి అంతే. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నాడు వైసీపీ ఎమ్మెల్యేలను వేటాడి.. టీడీపీలోకి లాక్కున్న తరహా రాజకీయాలకు భిన్నంగా జగన్ రాజకీయం చేయబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా వైసీపీలోకి తీసుకోలేరు. అదే సమయంలో వారితో రాజీనామాలు చేయించలేరు. అలాంటప్పుడు వారందరూ బీజేపీలో విలీనం కథ నడిపితే… అందుకు వైసీపీ పెద్దలు సాయపడితే… వామ్మో స్క్రీన్ ప్లే ఓ రేంజ్లో రాసినట్టేకదా…