అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా ఎమ్మెల్యేల పోకడలు ఇలాగే ఉంటాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
గురువారం ఈ తరహా సంఘటనలు రెండు జరిగాయి. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో జరుగగా మరొకటి తెలంగాణ లో చోటుచేసుకుంది. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ఇందుకు తాను అడ్డుపడడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ శాసన సభ్యుడు అంబటి రాంబాబు పేరుతో తనను బెదిరిస్తున్నారని హనుమ ప్రసాద్ అనే వ్యాపారి పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణలో ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై మహిళ నేరుగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందజేసింది. తన కుటుంబాన్ని ఆ శాసనసభ్యుడు టార్గెట్ చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆమె ఫిర్యాదు చేయగా హక్కుల సంఘం కేసు నమోదు చేసింది.
విషయానికొస్తే తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదంలో చిక్కుకున్నారు.తమ కుటుంబాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఒక మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయటం కలకలాన్ని రేపింది.మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు తమ కుటుంబాన్ని వేధిస్తున్నట్లుగా మణెమ్మ అనే మహిళ కంప్లైంట్ చేశారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నట్లుగా ఆమె చెప్పారు. వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారన్నారు.
తన భర్త లాయర్ గా పని చేస్తుంటారని.. ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తుండటంతో కక్ష కట్టినట్లుగా పేర్కొన్నారుతన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించటంతో తన భర్తను.. కొడుకును.. ఇతర కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాన్ని ఆమె కోరారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే భాస్కరరావు ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులు తన మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇంత జరిగినా టిఆర్ఎస్ అధిష్టానవర్గం ఈ విషయమై ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. మరి హక్కుల సంఘం ఏ విధంగా ఆ మహిళకి న్యాయం చేస్తుందో చూడాలి! ఏదేమైనా ఎమ్మెల్యేలు ప్రజా రక్షకులుగా ఉండాలి తప్ప భక్షకులు కారాదు సుమా!